న్యూఢిల్లీ, మే 22: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు ఎల్నినో కలవరపెడుతున్నది. తీవ్ర ఉష్ణ తాపానికి, భారత్సహా ఎన్నో దేశాల్లో కరువు పరిస్థితులకు ఎల్నినో కారణం కాగలదని సైన్స్ జర్నల్లో ప్రచురితమైన ఓ రీసెర్చ్ తెలిపింది. ఫలితంగా గ్లోబల్ ఎకానమీ 3 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టపోవచ్చని చెప్పింది. అమెరికా నుంచి ఆసియా వరకు ఎల్నినో ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. సముద్ర ఉపరితలాలు మునుపెన్నడూ లేనివిధంగా గరిష్ఠ స్థాయిలో వేడిని వెదజల్లుతున్నందున ఈ ఏడాది ఎల్నినో ప్రభావం తీవ్రంగానే ఉండొచ్చని సైన్స్ జర్నల్లోని రిసెర్చ్ అంటున్నది. ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని వివరించింది. ఎల్నినో కారణంగా 1982-83లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 4.1 లక్షల కోట్ల డాలర్లు, 1997-98లో 5.7 లక్షల కోట్ల డాలర్ల మేర ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది.