న్యూయార్క్, ఫిబ్రవరి 18: కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఉద్యోగులను ఆఫీసులకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఇందులోనూ వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలోనే వారానికి కనీసం 3 రోజులైనా కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మే 1 నుంచి అంతా ఆఫీసులకు వచ్చేందుకు సిద్ధం కావాలన్నది. ఈ మేరకు అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ ఓ పాలసీని ప్రకటించారు. ఇప్పటిదాకా ఆయా టీం లీడర్లే పనివేళలు, పనిచేసే విధానాన్ని నిర్ణయించుకుంటూ వస్తున్నారు. 2021 అక్టోబర్లో సంస్థ ఈ స్వేచ్ఛను కల్పించింది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులు ఆఫీసుల నుంచే పనిచేయాల్సిన అవసరం ఉంటుందని అమెజాన్ అభిప్రాయపడింది.
నిజానికి చాలా సంస్థలు ఇప్పటికే తమ ఉద్యోగులకు ఇండ్ల నుంచి పనిచేయడం ఆపేయాల్సి ఉంటుందన్న సంకేతాలిచ్చాయి. ఇప్పుడీ జాబితాలో అమెజాన్ కూడా చేరిపోయింది. గత నెల స్టార్బక్స్ సైతం వారానికి మూడు రోజులైనా ఆఫీసుల నుంచి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని తమ కార్పొరేట్ ఉద్యోగులతో అన్నది. ఇక వచ్చే నెల మార్చి నుంచి వారానికి నాలుగు రోజులు ఉద్యోగులు ఆఫీసుల నుంచే పనిచేసేలా డిస్నీ కంపెనీ చర్యలు చేపడుతున్నది. వాల్మార్ట్ కూడా ఈ తరహా నిర్ణయం వైపే అడుగులు వేస్తున్నది. భారత్లోనూ చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు టాటా చెప్పేశాయి. ఐటీ సంస్థల్లోనూ ఉద్యోగులు ఆఫీసులకే వచ్చి పనిచేస్తున్నారు. అయితే విదేశాల్లో మాత్రం ఇంకా ఇంటి నుంచే పని కొనసాగుతున్నది. అయితే కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో కార్పొరేట్లు ధైర్యం చేస్తున్నారు.
నిజానికి కరోనా దెబ్బకు యావత్తు మార్కెట్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఉద్యోగులూ వర్క్ ఫ్రం హోంకే పరిమితమయ్యారు. అయితే ఉద్యోగులు మళ్లీ ఆఫీసులకు వచ్చి పనిచేయడం ద్వారా పని విధానం సులువవుతుందని, పైగా స్థానిక వ్యాపారం పుంజుకోవడానికీ ఇది దోహదపడగలదన్న అభిప్రాయాలు ఇప్పుడు ఉన్నతస్థాయి వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆర్థిక మాంద్యం భయాల నడుమ వేల సంఖ్యలో ఉద్యోగులు ఊడిపోతున్నాయి. వర్క్ ఫ్రం ఆఫీస్ మొదలైతే ఈ దుస్థితికీ అడ్డుకట్ట పడుతుందన్న వాదనలూ ఇప్పుడు గట్టిగానే వినిపిస్తున్నాయి. గత నెల అమెజాన్ 18,000 మందిని ఉద్యోగాల్లో నుంచి తీసేయాలనుకుంటున్నట్టు ప్రకటించినది విదితమే.