హైదరాబాద్, అక్టోబర్ 26: హైదరాబాద్ ఆధారిత గ్లాండ్ ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ జూలై-సెప్టెంబర్లో రూ.241.24 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. పోయిన సారి రూ.302.80 కోట్ల లాభంతో పోలిస్తే 20.14 శాతం తగ్గింది. అమ్మకాలు పడిపోవడం, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లనే లాభాల్లో గండిపడిందని సంస్థ పేర్కొంది. ఆదాయం రూ.1,080.47 కోట్ల నుంచి రూ.1,044.4 కోట్లకు పడిపోయింది.
నిర్వహణ ఖర్చులు రూ.731 కోట్ల నుంచి రూ.785.95 కోట్లకు పెరగడం వల్లనే లాభాల్లో గండిపడినట్లు గ్లాండ్ ఫార్మా ఎండీ, సీఈవో శ్రీనివాస్ సాదు తెలిపారు. అమెరికా, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా దేశాల నుంచి రావాల్సిన రాబడిలో మూడు శాతం పెరిగి రూ.747.50 కోట్లు వచ్చినట్లు ఆయన చెప్పారు. కానీ, భారత్లో సంస్థ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 42 శాతం తగ్గి రూ.72 కోట్లకు పడిపోగా..ఇతర దేశాల నుంచి రూ.224 కోట్లు సమకూరినట్లు తెలిపింది.