హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(జీహెచ్ఐఏఎల్).. ఈ ఏడాదికిగాను స్కైట్రాక్స్ ప్రపంచ ఎయిర్పోర్టు అవార్డుల్లో మెరిసింది. భారత్, దక్షిణాసియాల్లో ‘విమానాశ్రయ సిబ్బంది’ విభాగంలో ఇక్కడి రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉత్తమ బహుమతి గెల్చుకున్నది. ఈ మేరకు శుక్రవారం విమానాశ్రయ నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతేగాక ఈ సంవత్సరపు ప్రపంచ టాప్-100 ఎయిర్పోర్టు లీగ్లో 63వ స్థానానికి పెరిగింది. నిరుడు 64వ స్థానంలో ఉన్నది.
ఇక భారత్-దక్షిణాసియాల్లో రెండో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయం, మూడో ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది. అలాగే పరిశుభ్రతలో నాల్గో స్థానం సాధించగా, ఆసియా దేశాల్లోని అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయాల్లో 6వ స్థానంలో ఉన్నది. పారిస్ (ఫ్రాన్స్)లో జరిగిన అవార్డు వేడుకల్లో జీహెచ్ఐఏఎల్కు బహుమతులు అందించారని ఈ ప్రకటన స్పష్టం చేసింది. కాగా, రాకపోకలు, షాపింగ్, భద్రత, ఇమ్మిగ్రేషన్ తదితర సేవలపై ప్రయాణీకుల అభిప్రాయాలను సేకరించి, వాటి ఆధారంగా అవార్డులిచ్చారు.