న్యూఢిల్లీ : టెక్ కంపెనీల్లో మాస్ లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. జర్మన్ సాఫ్ట్వేర్ దిగ్గజం శాప్ (ఎస్ఏపీ) గురువారం లేఆఫ్స్ బాంబు పేల్చింది. ఈ ఏడాది 3000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నామని కంపెనీ వెల్లడించింది. కోర్ బిజినెస్ పునర్వ్యవస్ధీకరణ లక్ష్యంగా కొలువుల కోతకు పాల్పడక తప్పడం లేదని సాఫ్ట్వేర్, క్లౌడ్ ఆధారిత కంప్యూటింగ్ సేవల కంపెనీ శాప్ స్పష్టం చేసింది.
పునర్వ్యవస్ధీకరణతో శాప్కు చెందిన 2.5 శాతం మంది ఉద్యోగులపై ప్రభావం ఉంటుందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 1,20,000 మంది ఉద్యోగులున్న శాప్ ఈ ఏడాది 3000 మంది ఉద్యోగులను సాగనంపనుంది. మెటా, అమెజాన్, గూగుల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఇప్పటికే పెద్దసంఖ్యలో లేఆఫ్స్ను ప్రకటించాయి.
ఇక ఆన్లైన్ మార్కెట్ రీసెర్చి సాఫ్ట్వేర్ బిజినెస్కు చెందిన క్వాల్ట్రిక్స్ సబ్సిడరీని విక్రయించనున్నట్టు కూడా శాప్ పేర్కొంది. ఈ విక్రయంతో తాము కోర్, క్లౌడ్ బిజినెస్పై మరింత దృష్టి సారించే వెసులుబాటు కలుగుతుందని కంపెనీ తెలిపింది. ఇక కంపెనీ వార్షిక ఫలితాల్లో గత ఏడాదితో పోలిస్తే రాబడి 11 శాతం పెరిగిందని నిర్వహణా లాభాలు రెండు శాతం తగ్గాయని శాప్ పేర్కొంది. 2023లో కంపెనీ నిర్వహణా లాభాలు 10 నుంచి 13 శాతం పెరుగుతాయని శాప్ అంచనా వేస్తోంది.