ముంబై, జూన్ 8: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మరోసారి ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను 2 శాతం వరకు సవరిస్తున్నట్టు వెల్లడించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో బీఎండబ్ల్యూ, మినీ వాహనాలు మరింత ప్రియంకాబోతున్నాయి.
ఈ సందర్భంగా బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్, సీఈవో హర్దీప్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ..రూపాయి పతనం చెందడంతోపాటు లాజిస్టిక్స్ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుండటంతో సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలను సవరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.