న్యూఢిల్లీ, మే 24: దేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) అధిపతులకు గిరాకీ భలేగా నడుస్తున్నది. ప్రధాన బహుళజాతి సంస్థలు.. తమ జీసీసీ సెంటర్లలో బాస్లుగా పనిచేసేవారికి భారీ ఎత్తున జీతాలిచ్చేందుకు సై అంటున్నాయి మరి. ఏటా ఏకంగా రూ.3 కోట్ల నుంచి 6 కోట్లదాకైనా ఇచ్చేందుకు వెనుకాడటం లేదిప్పుడు. పరిశ్రమ వర్గాల వివరాల ప్రకారం జీసీసీల్లో అత్యున్నత స్థాయిల్లో పనిచేసేందుకు అనుభవమున్నవారు కరువయ్యారు. ఇక భారత్లో జీసీసీ కార్యకలాపాలకున్న డిమాండ్ ఏ స్థాయిలో ఉన్నదో తెలిసిందే. దీంతో టాప్ ప్లేస్కు ఎంతైనా వెచ్చించేందుకు యాజమాన్యాలు సిద్ధపడుతున్నాయి.
గత రెండేండ్ల నుంచి దేశంలో చాలావరకు జీసీసీలు వ్యూహాత్మకంగా విస్తరణ బాట పడుతున్నాయి. అయితే సరైన నాయకత్వ లోపం వీటికి ప్రధాన అడ్డంకిగా మారుతున్నది. ప్రస్తుత పోటీ మార్కెట్లో ఈ పరిణామం.. మొదటికే మోసం తెస్తుందేమోనన్న భయంతో టాలెంట్ను ఒడిసి పట్టుకునేందుకు జీతాలను క్రమేణా పెంచుతూపోతున్నాయి. చివరకు కొన్ని జీసీసీల్లో ఎండీలకు ఏటా రూ.8 కోట్లపైనే ఇస్తుండటం గమనార్హం. ఈ మేరకు ఉద్యోగుల అన్వేషణ సంస్థ ఫెనో చెప్తున్నది. కొన్ని సంస్థలైతే ఈ రంగంలో సీనియర్లకు పూర్తి స్వేచ్ఛనూ ఇస్తున్నాయన్నది. వారికి సకల సౌకర్యాలు కల్పిస్తూ నాయకత్వ లోపాలను అధిగమిస్తున్నాయని అంటున్నది. నాలుగేండ్ల క్రితం ప్రముఖ జీసీసీల్లో ఏటా రూ.4 కోట్ల వేతనం తీసుకున్న ఉద్యోగులు.. ఇప్పుడు రూ.8 కోట్ల వేతనం తీసుకుంటున్నారని, బ్యాంకింగ్, ఆర్థిక రంగాలతో ముడిపడి ఉన్న జీసీసీల్లో ఉద్యోగులు 20వేలకుపైగానే ఉన్నారని, వీటి యాజమాన్యాలు తమ జీసీసీ బాస్లకు రూ.8 కోట్లకుపైగా వార్షిక వేతనం ఇస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలూ పేర్కొంటున్నాయి.
ఏఐ, ఎంఎల్ విభాగాల్లో మారుతున్న టెక్నాలజీ నైపుణ్యాలకు అనుగుణంగా ప్రతిభావంతులు, అనుభవజ్ఞుల అవసరం ఉంటున్నది. వారిని ఎలాగైనా అందిపుచ్చుకోవడమే ఇప్పుడు దేశీయ జీసీసీల అత్యంత ప్రాధాన్యతాంశం. అందుకే పెద్ద మొత్తాల్లో జీతాలనిచ్చేందుకూ వెనుకాడటం లేదు. చివరకు విదేశాల్లో ఉన్న భారతీయ నిపుణులనూ ఇక్కడకు రప్పిస్తున్నాయి.
-మీనాక్షి థాకర్, ట్రాన్సెర్చ్ ఇండియా భాగస్వామి
భారత్లోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లలో సీనియర్ ఉద్యోగుల జీతాలు పెరుగుతున్నాయి. జీసీసీల విస్తరణ దృష్ట్యా నైపుణ్యం కలిగినవారికి డిమాండ్ ఏర్పడింది. కృత్రిమ మేధస్సు, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ వంటి అంశాల్లో ఎదురయ్యే సంక్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల అన్వేషణ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నది.
-జస్ప్రీత్ సింగ్, గ్రాంట్ థాంటర్ భారత్ భాగస్వామి