Gautam Adani | హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికతో వారం రోజులుగా అదానీ గ్రూప్ సంస్థలు వరుస నష్టాల్లో కూరుకుపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం 1.23 గంటలకు ఆ సంస్థ చైర్మన్ గౌతం అదానీ వ్యక్తిగత సంపద 56.2 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీంతో వరల్డ్ రియల్ టైం బిలియనీర్స్ జాబితాలో ఆయన ర్యాంక్ 22వ స్థానానికి పతనమైందని ఫోర్బ్స్ తెలిపింది. మరోవైపు ఆయన ప్రత్యర్థిగా ఉన్న ముకేశ్ అంబానీ నికర వ్యక్తిగత సంపద 82 బిలియన్ డాలర్లుగా ఉంది.
బుధవారం ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ జాబితాలో ముకేశ్ అంబానీని దాటేసి గౌతం అదానీ 10వ స్థానానికి.. గురువారం 15 ర్యాంకుకు పడిపోయారు. గురువారం ఉదయం ముకేశ్ అంబానీ 84.3 బిలియన్ డాలర్లతో గౌతం అదానీని పక్కకు తప్పించి ప్రపంచంలోనే సంపన్న భారతీయుడిగా నిలిచారు.
ఫ్రాన్స్ లగ్జరీ ఫ్యాషన్ జెయింట్ లూయిస్ వైట్టూన్ ఫౌండర్, సీఈవో బెర్నార్డ్ అర్నాల్ట్.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఈ గణాంకాలు నిత్యం మారుతుంటాయి. అదానీ స్టాక్స్తోపాటు గౌతం అదానీ వ్యక్తిగత ఆదాయం మరింత పెరుగుతుందని అంచనా వేశారు. కానీ, యూఎస్ షార్ట్ షెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్.. దశాబ్ద కాలంగా అదానీ గ్రూప్ మోసాలకు పాల్పడుతుందని ఆరోపణలు గుప్పించింది. మోసాలు, స్టాక్స్లో అవకతవకలు, మనీ లాండరింగ్కు పాల్పడ్డారని ఆరోపణలు చేయడంతో గౌతం అదానీ వ్యక్తిగత సంపద నష్టపోవడమే కాక.. సంపన్న భారతీయుడిగా గౌతం అదానీ ర్యాంక్ పడిపోయింది.
అదానీ గ్రూప్ పేరెంట్ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 27.4 శాతం నష్టంతో శుక్రవారం ఉదయం 1,143.50 వద్ద బీఎస్ఈలో ట్రేడయింది. ఐదు సెషన్లలోనే అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్ 62 శాతానికి (రూ.1926.55) పైగా నష్టపోయింది