Gautam Adani | భారతీయ బిలియనీర్ గౌతం అదానీ ఇప్పటి వరకు ఉన్న ఆసియా కుబేరుడి హోదాను బుధవారం కోల్పోయారు. అదానీ గ్రూప్ తీవ్రమైన మోసాలకు పాల్పడుతున్నదని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న షార్ట్ షెల్లింగ్ కంపెనీ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో ఆయన సారధ్యంలోని గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్లు మరింత పతనం అయ్యాయి. అదానీ వ్యక్తిగత సంపద బుధవారం మధ్యాహ్నం వరకు మరో 13 బిలియన్ డాలర్లు ఆవిరై పోయిందని ఫోర్బ్స్ రియల్ టైం ట్రాకర్ పేర్కొంది. దీంతో గౌతం అదానీ వ్యక్తిగత సంపద 75.1 బిలియన్ డాలర్ల మార్క్ వద్ద నిలిచింది. హిండెన్బర్గ్ ఆరోపణలతో తొలి రోజు ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోయిన గౌతం అదానీ.. తాజాగా 15వ స్థానానికి పరిమితం అయ్యారు.
మిడిల్ ఈస్ట్ సంస్థాగత ఇన్వెస్టర్ల దన్నుతో మంగళవారం అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీవో) పూర్తిగా సబ్స్క్రైబ్ అయింది. కానీ బుధవారం ట్రేడింగ్లో 28.2 శాతం నష్టాలను చవి చూసింది.
అదానీ గ్రూప్లోని పది సంస్థల స్టాక్స్ బుధవారం నష్టాలతోనే ముగిశాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ ఇంట్రాడే ట్రేడింగ్లో 30 శాతం వరకు పతనమై.. ముగింపులో 28.5 శాతం (రూ.2,128.7) వద్ద స్థిర పడిందని బీఎస్ఈ గణాంకాలు చెబుతున్నాయి. అదానీ పోర్ట్స్ 20 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 10, అంబుజా సిమెంట్స్ 16.6, అదానీ గ్రీన్ ఎనర్జీ ఆరు శాతం నష్టాలతో ముగిశాయి. అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్డీటీవీ స్టాక్స్ ఐదు శాతం పతనంతో లోయర్ సర్క్యూట్స్ను తాకాయి.