న్యూఢిల్లీ, జూన్ 17: దేశంలో బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని బొగ్గు ఆధారిత విద్యుత్తు కొనుగోలు కాంట్రాక్టులన్నీ గౌతమ్ అదానీయే హస్తగతం చేసుకున్నారు. దశాబ్దకాలం తర్వాత 2024లో కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక థర్మల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను పునరుద్ధరించింది. అయితే ఇందులో అదానీ గ్రూప్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. 2024 మార్చి-2026 జనవరి మధ్య 12 దీర్ఘకాలిక బొగ్గు ఆధారిత విద్యుత్తు కొనుగోలు కాంట్రాక్టులకు బిడ్లను ఆహ్వానించారు. వీటిలో 8 కాంట్రాక్టులు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే ఉన్నాయి.
అవన్నీ కూడా ఏదో ఓ రకంగా అదానీ గ్రూప్నకే దక్కడం గమనార్హం. దీంతో రాబోయే 25 ఏండ్లలో రూ.13.27 లక్షల కోట్లకుపైగా ఆదాయం కంపెనీకి పక్కా అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ర్టాల్లోని బీజేపీ సర్కారీ పెద్దలు అదానీ గ్రూప్నకు అనుకూలంగా నిబంధనల్ని మార్చారా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతంలో ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ సైతం ఇదే నివేదించింది. అయితే తాము పారదర్శకంగా ఈ బిడ్లను దక్కించుకున్నామని అదానీ గ్రూప్ చెప్తున్నది.
మహారాష్ట్ర ప్రభుత్వం అటు బొగ్గు ఆధారిత విద్యుత్తును, ఇటు సౌర విద్యుత్తును ఒకే సంస్థ నుంచి కొనుగోలు చేసేలా టెండర్ను జారీ చేసింది. అలాగే తప్పనిసరైన రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందస్తు అనుమతినీ తీసుకోకుండా నిబంధనల్ని ఉల్లంఘించారు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థల అవసరాలను పరిగణనలోకి తీసుకొనే సదరు కమిషన్ టెండర్స్ను ఆమోదిస్తుంది. అలాగే బిడ్డింగ్లో పాల్గొన్న పలు కంపెనీలూ ప్రభుత్వ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇలా మిగతా రాష్ర్టాల్లోనూ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తుండటం గమనార్హం.
కర్ణాటక
570.5 మెగావాట్లు
రూ.54,255 కోట్లు
అస్సోం
3,400 మెగావాట్లు
రూ.3.49 లక్షల కోట్లు
మహారాష్ట్ర
4,321 మెగావాట్లు
రూ.3.90 లక్షల కోట్లు
మధ్యప్రదేశ్
1,600 మెగావాట్లు
రూ.1.5 లక్షల కోట్లు
బీహార్
2,400 మెగావాట్లు
రూ.2.4 లక్షల కోట్లు
ఉత్తరప్రదేశ్
1,600 మెగావాట్లు
రూ.1.4 లక్షల కోట్లు