ముంబై, సెప్టెంబర్ 23: దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ సంపద కూడా రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో రూ.1.69 లక్షల కోట్ల సంపదతో ప్రవాస భారతీయుల జాబితాలో తొలిస్థానంలో ఉండగా..దేశీయ కుబేరుల జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు.
దుబాయ్లో నివసిస్తున్న ఆయన..సింగపూర్, దుబాయ్, జకార్తల్లో ట్రేడింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. గడిచిన ఐదేండ్లలో 850 శాతం పెరిగిన సంపద..గడిచిన సంవత్సరంలో రూ.37,400 కోట్లు ఎగబాకింది. సరాసరిగా రోజుకు ఆయన సంపద రూ.102 కోట్లుగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.