గత రెండు రోజుల్లో దేశీయ స్టాక్మార్కెట్లు నేల చూపులు చూస్తుండటంతో రిలయన్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. దీనివల్ల రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ లాభాల్లోనూ భారీ కోత పడింది. మంగళవారం ఆదాయంలోనూ ముకేశ్ అంబానీని గౌతం అదానీ దాటేశారు. అంతే కాదు వ్యక్తిగత సంపదలోనూ ముకేశ్ అంబానీని అధిగమించి ప్రపంచంలోనే 11వ కుబేరుడి స్థానాన్ని ఆక్రమించారు. భారత్లోనే అతిపెద్ద కుబేరుడిగా అవతారమెత్తారు.
ప్రపంచంలో 11వ కుబేరుడిగా..
ఫోర్బ్స్ రియల్టైం ప్రకారం వ్యక్తిగత సంపదలో రిలయన్స్ను గౌతం అదానీ దాటేశారు. గౌతం అదానీ వ్యక్తిగత సంపద 90 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 6.72 లక్షల కోట్లు. ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద 89.8 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.6.71 లక్షల కోట్లు). సంపాదన పరంగా గౌతం అదానీ ప్రపంచంలోనే 11వ కుబేరుడిగా నిలిచారు.
2 రోజుల్లో ఇలా రిలయన్స్ స్క్రిప్ట్
గత రెండు రోజుల్లో రిలయన్స్ షేర్ రూ.155 పడిపోయింది. మంగళవారం 2.29 శాతం నష్టంతో అంటే రూ. 2,323.05 వద్ద స్క్రిప్ట్ ట్రేడయింది. గత ఐదు సెషన్లలో రిలయన్స్ స్టాక్ రూ.200 వరకు నష్టపోయింది. ఫోర్బ్స్ డేటా ప్రకారం ముకేశ్ అంబానీ సంపద గత రెండు రోజుల్లోనే రూ.52వేల కోట్లు (700 కోట్ల డాలర్లు) నష్టపోయింది.
ప్రతిరోజూ అదానీ వ్యక్తిగత సంపద
గౌతం అదానీ వ్యక్తిగత సంపద ప్రతి రోజూ రూ.6000 కోట్లు పెరుగుతున్నది. ఫోర్బ్స్ రియల్ టైం డేటా ప్రకారం గౌతం అదానీ వ్యక్తిగత సంపద గత నెల 31న 78 బిలియన్ల డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.5.82 కోట్లు). కానీ ఈ నెల 18 నాటికి సంస్థ నికర సంపద 93 బిలియన్ల డాలర్లు (రూ.6.95 లక్షల కోట్లు) గా నమోదైంది. ఈ నెల 25 నాటికి 90 బిలియన్ డాలర్లకు క్షీణించింది.