Gautam Adani | ఆసియా ఖండ బిలియనీర్లలో ఒకరు గౌతం అదానీ.. శుక్రవారానికి ఆయనకు 60 వసంతాలు నిండుతాయి. ఈ నేపథ్యంలో అదానీ కుటుంబం కీలక నిర్ణయం తీసుకున్నది. విద్య, హెల్త్కేర్, నైఫుణ్యం అభివృద్ధి కోసం రూ.60 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు గౌతం అదానీ స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ మొత్తం సొమ్ము అదానీ ఫౌండేషన్ ద్వారా వివిధ దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. గౌతం అదానీ తండ్రి శాంతిలాల్ అదానీ శత జయంతి కూడా ఈ ఏడాదే కావడంతో దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాతృత్వ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
గౌతం అదానీ ప్రకటించిన రూ.60 వేల కోట్ల నిధులను దేశవ్యాప్తంగా విద్యా వైద్య రంగాల్లో మౌలిక వసతుల కల్పన, నైపుణ్యాభివృద్ధి కోసం అదానీ ఫౌండేషన్ ఖర్చు చేయనున్నది. పత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పనకు అదానీ ఫౌండేషన్ ప్రాధాన్యం ఇస్తుంది. ఈ నిధుల వినియోగంపై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే మూడు కమిటీలు తుది నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ కమిటీల్లో సభ్యులుగా అదానీ కుటుంబ సభ్యులు ఉంటారు. ఇప్పటి వరకు దాతృత్వంలో కార్పొరేట్లు రతన్ టాటా, అజీం ప్రేమ్ జీ ముందు ఉండేవారు. తాజాగా వారి సరసన గౌతం అదానీ చేరనున్నారు.
1988లో కమొడిటీ ట్రేడింగ్తో వ్యాపార లావాదేవీలు ప్రారంభించింది అదానీ గ్రూప్. తర్వాత క్రమక్రమంగా.. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. గత నాలుగేండ్లలో గౌతం అదానీ పట్టిందల్లా బంగారమైంది. బొగ్గు, విద్యుత్, ఎయిర్పోర్టులు, పోర్టులు తదితర రంగాల్లోకి ఎంటరైంది అదానీ గ్రూప్, ఒక దశలో రిలయన్స్ అధినేత.. ఆసియా కుబేరుడిగా ఉన్న ముకేశ్ అంబానీని కూడా దాటేశారు. ఈ ఒక్క ఏడాదిలోనే గౌతం అదానీ వ్యక్తిగత సంపద 15 బిలియన్ల డాలర్లు పెరుగడం గమనార్హం.
బ్లూమ్బర్గ్ రూపొందించిన ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్-10లోనూ చోటు దక్కించుకున్న గౌతం అదానీ.. భారీ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. ప్రపంచ బిలియనీర్లు మార్క్ జుకర్బర్గ్, వారెన్ బఫెట్ కూడా తమ వ్యక్తిగత సంపదలో అత్యధికం దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారు.