Fuel Price Hike | గతేడాది మే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్ ధర రూ.36, లీటర్ డీజిల్ ధర రూ.26.28 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్లే దేశీయంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతున్నట్లు కేంద్రం వాదిస్తున్నది. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్లు, ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో పెట్రోల్, డీజిల్ వినియోగం రికార్డు స్థాయిలో పడిపోయాయి. ఫలితంగా బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర కూడా రికార్డు స్థాయిలో పడిపోయి 19 డాలర్ల కిందకు పతనమైంది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరల తగ్గుదలతో లభించే ప్రయోజనాలు సామాన్యులకు చేరాలి. కానీ కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఎక్సైజ్ సుంకాలు పెంచివేసింది. 2020 మే 18న లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.71.26, డీజిల్ ధర రూ.69.39 అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోఎల్) వెబ్సైట్ తెలిపింది. మే 2020 నుంచి లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ ధర భారీగా పెరిగింది. తాజాగా శనివారం వరుసగా నాలుగోరోజు పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ముడి చమురు సంస్థలు 36 పైసలు చొప్పున పెంచేశాయి. ఫలితంగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.24, లీటర్ డీజిల్ ధర రూ.95.97కు చేరుకున్నది.
కరోనాతో దాదాపు అన్ని రంగాల పరిశ్రమలు మూత పడ్డాయి. తత్ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు వివిధ పన్నుల రూపేణా రావాల్సిన ఆదాయాన్ని.. పెట్రోల్, డీజిల్లపై ఎక్సైజ్ సుంకం పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసుకున్నది. తద్వారా పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా స్థిరంగా కొనసాగాయి. ప్రస్తుతం వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ప్రపంచ దేశాల్లో ఆంక్షలు ఎత్తేయడంతో క్రూడాయిల్కు గిరాకీ పుంజుకున్నది. డిమాండ్కు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు కరోనా ముందు స్థాయి కంటే పెరిగిపోయాయి. కానీ 2020 మేలో విధించిన ఎక్సైజ్ సుంకాలను యధాతథంగా కొనసాగిస్తోంది. తద్వారా సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది.
ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ మాత్రం.. పెట్రోలియం ఉత్పత్తులపై సుంకాల ద్వారా వచ్చే ఆదాయంతోనే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.
వందకోట్ల మందికి ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగిందని కేంద్ర మంత్రి పూరీ చెప్పారు. కరోనా వేళ ఏడాది పాటు 90 కోట్ల మంది మూడు పూటల భోజన వసతి కల్పించామన్నారు. ఉజ్వల పథకం కింద 8 కోట్ల మంది మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ అందించామని వివరించారు. పెట్రోలియం ఉత్పత్తులపై వచ్చే ఎక్సైజ్ డ్యూటీ రూ.32తోనే ఇవన్నీ సాధ్యమయ్యాయని చెప్పారు.