బెంగళూరు/ముంబై, డిసెంబర్ 31: గడిచిన పదేండ్లలో దేశీయ ఐటీ సంస్థల సారథుల వార్షిక జీతాలు ఏకంగా 1,500 శాతం ఎగబాకాయి. ఇదే సమయంలో సంస్థలోకి అడుగిడిన కొత్త ఉద్యోగుల వేతనాల్లో పెంపు 50 శాతానికే పరిమితమైంది. 2012తో పోల్చితే 2022లో ఐటీ కంపెనీల్లోని ఫ్రెషర్స్ సాలరీల్లో సగటున సుమారు 47 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. అయితే సీఈవోల జీతాల్లో మాత్రం 1,492 శాతం వృద్ధి నమోదైనట్టు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తాజా విశ్లేషణలో తేలింది.
ఇది మంచిది కాదు
ఈ తరహా అసమానతలు ఎంతమాత్రం మంచివి కావని ఐటీ ఇండిస్ట్రీ మాజీలు అభిప్రాయపడుతున్నారు. నిజానికి 10-12 ఏండ్ల క్రితం కూడా సంస్థలోకి వచ్చిన కొత్తవారు ఏటా రూ.3.5-4 లక్షల జీతాలే తీసుకున్నారని, ఇప్పుడు కూడా అంతే పొందుతున్నారని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో, ఆ సంస్థ బోర్డు సభ్యుడు టీవీ మోహన్దాస్ పాయ్ అన్నారు. కానీ మేనేజర్లు, సీనియర్ల వేతనాలు అప్పటితో చూస్తే నేడు 4, 5, 7 రెట్లు పెరిగాయన్నారు. హెచ్సీఎల్ టెక్ మాజీ సీఈవో వినీత్ నయ్యర్ సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
‘ఈ వ్యత్యాసం దురదృష్టకరం. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్రను సరిగ్గా అర్థం చేసుకోవాలి. నిజానికి సంస్థ మార్కెటింగ్ బడ్జెట్లో, ప్రచార వ్యయంలో కొంతైనా ఉద్యోగుల జీతాలను పెంచితే ఈ పరిస్థితి ఉండదన్నారు.