Air Traffic Controllers Strike | ఫ్రాన్స్ రాజధాని పారిస్ ఓర్లీ విమానాశ్రయ పరిధిలో శనివారం నుంచి ఆదివారం వరకూ 70 శాతం విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సమ్మెకు దిగడంతో విమాన సర్వీసులు రద్దుచేశామని ఫ్రాన్స్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. దీనివల్ల శనివారం ఉదయం నాలుగు గంటల నుంచి ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకూ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికుల్లేక పారిస్ లోని ఓర్లీ అంతర్జాతీయ విమానాశ్రయం బోసి పోయింది.
జూలై 26 నుంచి ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్ కోసం ఫ్రాన్స్ లోనే రెండో అతిపెద్ద ఓర్లీ విమానాశ్రయం ఏర్పాట్లు చేస్తున్న వేళ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సమ్మెకు దిగడం ప్రాధాన్యం సంతరించుకున్నది. నెల రోజుల్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సమ్మెకు దిగడం ఇది రెండోసారి. ఇంతకుముందు యూరప్ పొడవునా వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి.
ఓర్లీ విమానాశ్రయ అధికారులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల ప్రధాన సంఘం ఎస్ఎన్సీటీఏ మధ్య వివాదం ముగిసినా, రెండో అతిపెద్ద కార్మిక సంఘం యూఎన్ఎస్ఏ-ఐసీఎన్ఏ మాత్రం విమానాశ్రయంలో సరిపడా సిబ్బందిని నియమించలేదని తక్కువ సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2027 నాటికి విధుల నిర్వహణకు శాశ్వత సిబ్బందే ఉండరని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం కాంట్రాక్ట్ ఉద్యోగులతో పని చేయిస్తున్నారని ఆరోపించింది. ఉద్యోగాల భర్తీపై స్పష్టత ఇచ్చే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సమ్మెను ఫ్రాన్స్ ప్రభుత్వం ఖండించింది. స్థానిక ఏజెంట్ల మాటలు నమ్మి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సమ్మెకు దిగారని, దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందుల పాలవుతున్నారని ఫ్రాన్స్ విమానయాన శాఖ డిప్యూటీ మంత్రి ప్యాట్రిస్ వెగ్రిట్ చెప్పారు. ఆందోళనకారులతో చర్చలకు సిద్ధం అని తెలిపారు.