హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో కార్య కలాపాలు సాగిస్తున్న ఫ్రాన్స్కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ సఫ్రాన్ విస్తరణ బాట పట్టింది. భారీ ఎత్తున లీప్ టర్బోపాన్ ఇంజిన్లను తయా రు చేసేలా కొత్తగా ఓ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నది. ఈ మేరకు శంషాబాద్లోని జీఎమ్మార్ హైదరాబాద్ ఏవియేషన్ సెజ్ లిమిటెడ్తో సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా ఒప్పందం చేసుకున్నది. ఇందులో భాగంగా సెజ్ పరిధిలోని 23.5 ఎకరాల్లో ఈ ప్లాంట్ను నెలకొల్పనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో నిర్మాణ పనులు మొదలు కానుండగా.. 2025 ఆరంభంలో ఉత్పత్తిని ప్రారంభించాలని చూస్తున్నారు.
ఏటా 100 ఇంజిన్ల తయారీ
ఏడాదికి 100 ఇంజిన్ల తయారీ లక్ష్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటవుతున్నదని జీఎమ్మార్ ఎయిర్పోర్టు ల్యాండ్ డెవలప్మెంట్ సీఈవో అమన్ కపూర్ తెలిపారు. 2035 నాటికి ప్లాంట్ వార్షిక ఉత్పాదక సామర్థ్యాన్ని 300 ఇంజిన్లకు పెంచనున్నారని చెప్పారు. దీంతో రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు బాగా మెరుగుపడగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఏరోనాటికల్ ఎకోసిస్టం బలోపేతం
ఇదిలావుంటే ఫ్రాన్స్ ప్రధాన కేంద్రంగా విమాన ప్రొపల్షన్, ఎక్విప్మెంట్, స్పేస్, డిఫెన్స్ రంగాలలో తాము సేవలు అందిస్తున్నామని సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ సపోర్ట్ అండ్ సర్వీసెస్ విభాగం ఉపాధ్యక్షుడు నికోలస్ పొటియర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలో విమాన ఉత్పత్తికి మరింత దన్ను లభిస్తుందన్న విశ్వాసాన్ని కనబర్చారు. అలాగే విమానయాన రంగ కస్టమర్లకు మెరుగైన సేవల్ని అందించడంలో నూతన ప్లాంట్ కీలకపాత్ర పోషిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఏరోనాటికల్ ఎకోసిస్టం అభివృద్ధికి హైదరాబాద్ వేదిక కానుందని చెప్పారు.
వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు
ఈ ప్లాంట్ రాకతో వెయ్యి మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని పొందనున్నారు. ఇప్పటికే జీఎమ్మార్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్కులో సఫ్రాన్ సంస్థ కేబుల్ హార్నెసింగ్, ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ విడిభాగాలను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు లీప్ టర్బోపాన్ ఇంజిన్ల తయారీకి వెళ్తుండగా, సీఎఫ్ఎం ఇంజిన్ మెయింటెనెన్స్ శిక్షణ సదుపాయాన్నీ తేనున్నారు.