న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పోర్ట్ఫోలియో మదుపరుల (ఎఫ్పీఐ) నుంచి వచ్చిన పెట్టుబడుల విలువ 626 బిలియన్ డాలర్ల (రూ.52,03,312 కోట్లు)కు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) నాటికి ఈ స్థాయిలో ఉన్నాయని మార్నింగ్స్టార్ తాజా నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) జూన్ ఆఖరుతో చూస్తే ఏడాది కాలంలో 20 శాతం వృద్ధి కనిపించింది. నిరుడు జూన్ 30కి 523 బిలియన్ డాలర్ల వద్ద ఎఫ్పీఐ పెట్టుబడుల విలువ ఉందని, ఈ జూన్ 30కి 103 బిలియన్ డాలర్లు ఎగిసి 626 బిలియన్ డాలర్లకు చేరుకుందని వివరించింది.
ఈ ఏప్రిల్-జూన్ వ్యవధిలో దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్పీఐలు పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొచ్చారు. కేవలం ఈ 3 నెలల్లోనే ఏకంగా 84 బిలియన్ డాలర్లు (రూ.6,98,208 కోట్లు) పట్టుకొచ్చారు. ఈ ఏడాది మార్చి 31కి 542 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీంతో 15 శాతం వృద్ధి నమోదైనట్టు తాజా నివేదికలో మార్నింగ్స్టార్ తెలిపింది. నిజానికి ఈ ఏడాది జనవరి-మార్చిలో భారతీ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్పీఐలు 3.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే.. భారతీయ ఈక్విటీల్లోకి ఎఫ్పీఐ పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు దోహదపడ్డాయని మెజారిటీ ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల నిర్ణయాలతోపాటు అమెరికా, ఐరోపాల్లో బ్యాంకింగ్ సంక్షోభం, అంతర్జాతీయ ద్రవ్యోల్బణ గణాంకాలు, చైనా ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కలిసొచ్చాయని చెప్తున్నారు.