NSE | నిరాకారుడు.. సిద్ధ పురుషుడు.. శిరోణ్మని.. ఇలా రకరకాల పేర్లు చెప్పారు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ. అంతే కాదు.. మనం అనుకున్న రూపంలో ప్రత్యక్షం అవుతాడని నమ్మించేందుకు పూనుకున్నారు.. కానీ సాంకేతిక ఆధారాలతో సీబీఐ వర్గాలు.. సదరు అదృశ్య యోగి ఎవరో కనిపెట్టేశాయి.. నిబంధనలకు భిన్నంగా చిత్రా రామకృష్ణ నియమించిన ఎన్ఎస్ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణ్యనే.. ఆ నిరాకార యోగి అని నిర్ధారణకు వచ్చేశాయి. అయితే, అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
చిత్రా రామకృష్ణ పంపిన ఈ-మెయిల్స్ ఆధారంగా గుట్టు రట్టు చేశాయి సీబీఐ వర్గాలు. ఆనంద్ సుబ్రమణ్యన్ విడిగా ‘rigyajursama@outlook.com’ అనే ఈ-మెయిల్ సృష్టించారని సెబీ సమర్పించిన నివేదిక ఆధారంగా సీబీఐ అధికారులు తేల్చేశారు. ఆనంద్ సుబ్రమణ్యన్కు చిత్ర రామకృష్ణన్ తన rchitra@icloud.com ఈ-మెయిల్ నుంచి ఎన్ఎస్ఈ కీలక రహస్య డేటాను ఆనంద్ సుబ్రమణ్యన్కు పంపేవారని అధికార వర్గాలు నిర్ధారణకు వచ్చాయి.
చిత్ర రామకృష్ణ పంపిన ఈ-మెయిల్స్ స్క్రీన్షాట్లు.. ఆనంద్ సుబ్రమణ్యన్ వ్యక్తిగత ఈ-మెయిల్స్లో లభ్యం అయ్యాయి. చిత్రారామకృష్ణకు పంపిన ఈ-మెయిల్లో సదరు యోగి.. తాను మనిషి రూపం ధరిస్తే ఆనంద్ సుబ్రమణ్యన్లాగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొనడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో ఎన్ఎస్ఈలో కో-లొకేషన్ స్కామ్ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. శుక్రవారం ఉదయం ఆనంద్ సుబ్రమణ్యన్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టింది.
రెండున్నర దశాబ్దాలుగా తాను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఆ యోగి ప్రభావానికి గురయ్యానని చిత్ర రామకృష్ణ చెప్పారు. అదే సమయంలో ఆనంద్ సుబ్రమణ్యన్.. ఆ యోగి కానే కాదని దాట వేసేందుకు ప్రయత్నించారు. రవి నరైన్ స్థానంలో 2013లో ఎన్ఎస్ఈ సీఈవోగా నియమితులైన చిత్రా రామకృష్ణ… తొలుత ఆనంద్ను చీఫ్ స్ట్రాటర్జిక్ అడ్వైజర్గా నియమించారు. తర్వాత గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ప్రమోట్ చేశారు. అతడికి వేతనంగా రూ.4.21 కోట్ల ప్యాకేజీ ఖరారు చేశారు.
కానీ, కేసు దర్యాప్తులో సీబీఐ అధికారులకు ఆనంద్ సుబ్రమణ్యన్ సహకరించడం లేదని సమాచారం. తమ ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని సీబీఐ వర్గాలు అంటున్నాయి. ఈ-మెయిల్స్ను చాలా రోజులుగా తాను తెరవడం లేదని, అందువల్ల పాస్వర్డ్లు మరిచిపోయానని ఆనంద్ సుబ్రమణ్యన్ వాదిస్తున్నారని తెలిసింది. నిరాకార యోగి ఎవరో చెప్పమంటే సరైన జవాబివ్వడం లేదని వినికిడి.