Narayanan Vaghul – ICICI Bank | భారత్ ఆధునిక బ్యాంకింగ్ రూపశిల్పి, ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ నారాయణ్ వాఘుల్ (88) శనివారం మధ్యాహ్నం చెన్నైలోని అపోలో దవాఖానలో మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ్ వాఘుల్.. వెంటిలేటర్ మద్దతుపై చికిత్స పొందారని ఆయన కుటుంబం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆయనకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు.
బ్యాంకింగ్ ఇండస్ట్రీలో పలు సంస్థలకు నాయకత్వ స్థానాల్లో నారాయణ్ వాఘుల్ పని చేశారు. 1985లో భారత్లో ప్రారంభమైన ఐసీఐసీఐ బ్యాంకుకు 11 ఏండ్ల పాటు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పని చేశారు. ఒక పబ్లిక్ ఫైనాన్స్ సంస్థగా ఐసీఐసీఐని ప్రైవేట్ బ్యాంకుగా తీర్చిదిద్దడంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. బ్యాంకింగ్ రంగానికి ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్ పురస్కారంతో నారాయణ్ వాఘుల్ను గౌరవించింది.
1960వ దశకంలో భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)లో ఆఫీసర్గా పని చేశారు. తదుపరి కొన్నాళ్లకు జాతీయ బ్యాంకింగ్ యాజమాన్య సంస్థలో అధ్యాపకుడిగా పని చేసేందుకు ఎస్బీఐలో ఉద్యోగాన్ని వదులుకున్నారు. తర్వాత రెండేండ్లలోపే పుణె కేంద్రంగా పని చేసిన సంస్థ డైరెక్టర్గా నియమితులైనా తిరిగి కేంద్ర ప్రభుత్వ బ్యాంక్ ‘సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, 1981లో బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. తదుపరి 1985లో ఐసీఐసీఐ సీఎండీగా నియమితులైన వాఘుల్.. యువ బ్యాంకర్ల టీంతో.. ఆ సంస్థను ప్రైవేట్ బ్యాంకుగా తీర్చిదిద్దారు. మద్రాస్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వాఘుల్.. 1996 వరకూ ఐసీఐసీఐ బ్యాంకులో పని చేశారు. తదుపరి పలు కార్పొరేట్ సంస్థల బోర్డు సభ్యుడిగా కొనసాగారు.