దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే ఫారెక్స్ నిల్వలు క్రమేణా కరిగిపోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం గత నెల 1 నుంచి ఈ నెల 6 వరకు ఏకంగా 14 బిలియన్ డాలర్లకుపైగా హరించుకుపోయాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భారతీయ ఎకానమీకి పెద్ద ప్రమాదమే వాటిల్లుతుందన్న అభిప్రాయాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
Forex Reserves | ముంబై, అక్టోబర్ 13: దేశంలోని విదేశీ మారకం నిల్వలు (ఫారెక్స్ రిజర్వులు) అంతకంతకూ పడిపోతున్నాయి. కేవలం నెల రోజుల్లో 14 బిలియన్ డాలర్లకుపైగా హరించుకుపోవడం ఇప్పుడు అత్యంత ఆందోళనకరంగా తయారైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వివరాల ప్రకారం సెప్టెంబర్ 1న 598.897 బిలియన్ డాలర్లుగా ఉన్న భారతీయ ఫారెక్స్ నిల్వలు.. ఈ నెల 6 నాటికి 584.742 బిలియన్ డాలర్లకు దిగజారాయి. దీంతో 14.155 బిలియన్ డాలర్లు క్షీణించినైట్టెంది. ఈ నెల 6తో ముగిసిన వారంలో 2.166 బిలియన్ డాలర్లు పతనమైనట్టు శుక్రవారం ఆర్బీఐ తాజా గణాంకాల్లో తేలింది. ఇక గత నెలలో ఒక్క తొలి వారంలోనే అత్యధికంగా సుమారు 5 బిలియన్ డాలర్ల మేర ఫారెక్స్ రిజర్వులు పడిపోవడం గమనార్హం. కాగా, 2021 అక్టోబర్లో దేశ ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్ల గరిష్ఠ స్థాయిని తాకాయి. దాంతో పోల్చితే ఈ రెండేండ్లలో 60 బిలియన్ డాలర్ల క్షీణతే కనిపిస్తున్నది.
దేశీయ ఫారెక్స్ రిజర్వులు ఇలాగే పడిపోతే భారత ఆర్థిక వ్యవస్థకు ముప్పేనన్న అంచనాలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆర్బీఐ సమాచారం మేరకు వారం వారం డాలర్ నిల్వలు క్షీణిస్తున్న పరిస్థితే కనిపిస్తున్నది. దీంతో ఈ నిల్వలు బలంగా ఉంటే ఎకానమీకి ఎంత లాభమో.. బలహీనపడితే కూడా అంతే నష్టమని మెజారిటీ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోతున్నదని, ఇటువంటి సమయంలో దేశంలో డాలర్ నిల్వలు క్షీణించడం ఎంతమాత్రం మంచిది కాదని చెప్తున్నారు. ముడి చమురు దిగుమతులు భారమవుతాయని, ఫలితంగా ద్రవ్యోల్బణం పెచ్చుమీరి, ఆర్బీఐ వడ్డీరేట్లు పెరిగి, రుణ లభ్యత తగ్గుతుందని పేర్కొంటున్నారు. ఇవన్నీ కూడా దేశ జీడీపీ వృద్ధికి సవాల్ విసిరేవేనంటున్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై ఆర్బీఐతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలని లేకపోతే మాంద్యం బారినపడటం ఖాయమని హితవు పలుకుతున్నారు. అసలే అంతర్జాతీయంగా రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు చాలవన్నట్టు.. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం వచ్చిపడిందని, ఇది ముదిరితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గడ్డుకాలమేనని వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఎకానమీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని ఒకింత భయాందోళనల్నే వెలిబుచ్చుతున్నారు.