ముంబై, అక్టోబర్ 7: విదేశీ మారకం నిల్వలు హారతి కర్పూరంలాగా కరిగిపోతున్నాయి. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఇతర కరెన్సీలు నేలచూపు చూస్తున్నాయి. దీంతో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ అంతకంతకు పడిపోవడంతో దేశీయ ఫారెక్స్ రిజర్వులు రెండేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడానికి కారణమయ్యాయి. గతవారం ముగింపునాటికి భారత్లో ఫారెక్స్ రిజర్వులు 4.86 బిలియన్ డాలర్లు తరిగిపోయి 532.66 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది.
వీటిలో విదేశీ మారకం రూపంలో ఉన్న ఆస్తుల విలువ 4.41 బిలియన్ డాలర్లు తగ్గి 472.81 బిలియన్ డాలర్లకు పడిపోవడం ఇందుకు కారణమని సెంట్రల్ బ్యాంక్ విశ్లేషించింది. అలాగే పసిడి రిజర్వులు కూడా 281 మిలియన్ డాలర్లు తగ్గి 37.61 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. జూలై 2020 తర్వాత ఫారెక్స్ రిజర్వులు ఇంతటి స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబర్లో రిజర్వులు రికార్డు స్థాయి 645 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే.