న్యూఢిల్లీ, మే 27: విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత స్టాక్ మార్కెట్లో ఈ మే నెలలో భారీగా పెట్టుబడులు చేశారు. ఈ నెల 26 వరకూ రూ.37,317 కోట్ల ఎఫ్పీఐ నిధులు తరలివచ్చాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇంతభారీగా ఇన్వెస్ట్ చేయడం 9 నెలల తర్వాత ఇదే ప్రథమం. ఫైనాన్షియల్ సర్వీసుల షేర్లను ఎఫ్పీఐలు జోరుగా కొనుగోలు చేశారని, ఇతర రంగాలకు సైతం పెట్టుబడులు మళ్లించారని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
రానున్న రోజుల్లో ఈ ట్రెండ్ కొనసాగుతుందని, దీంతో నిఫ్టీ-50 సూచి కొత్త రికార్డుస్థాయిని చేరే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది నవంబర్ తర్వాత ఒకే నెలలో ఇంత భారీ ఎఫ్పీఐ పెట్టుబడులు రావడం ఇదే ప్రథమమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ చెప్పారు. ఫైనాన్షియల్ సర్వీసులు, ప్రత్యేకించి బ్యాంకింగ్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిపారని, ఆటోమొబైల్స్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికం రంగాలకు చెందిన షేర్లపై సైతం ఆసక్తి కనపర్చారని అన్నారు.