Foreign Investments | దేశీయ మార్కెట్పై విదేశీ ఇన్వెస్టర్లు కాన్ఫిడెన్స్ కోల్పోయారా.. అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గత రెండు రోజుల్లో దాదాపు 500 మిలియన్ల డాలర్ల విలువైన ప్రభుత్వ డెట్ బాండ్లను విక్రయించడమే దీనికి నిదర్శనం. కీలకమైన యూఎస్ డేటా విడుదల కానుండగా, వడ్డీరేట్లపై అమెరికా ఫెడ్ రిజర్వ్ కీలక నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ప్రభుత్వ బాండ్లను విదేశీ ఇన్వెస్టర్లు విక్రయించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
గత శుక్రవారం, సోమవారం ట్రేడింగ్లలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.41.1 బిలియన్ల విలువైన బాండ్లు విక్రయించేశారని సీసీఐఎల్ డేటా పేర్కొంది. 80 శాతానికి పైగా ఆంక్షలు ఎత్తేసిన ప్రభుత్వ సెక్యూరిటీల్లోనే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఉపసంహరించుకోవడం గమనార్హం.
2027 నాటికి మెచ్యూరిటీ లభించే బాండ్లలో 7.38%, 14 ఏండ్ల పరిమితి గల అంటే 2036 నాటికి మెచ్యూర్ అయ్యే బాండ్లు 7.54% అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ. 1690 కోట్లుగా ఉంది. బుధవారం అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లపై కీలక నిర్ణయం ప్రకటించనున్నది. మళ్లీ వడ్డీరేట్లు పెంచనున్నదన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. శుక్రవారం నాన్-ఫామ్ ఉద్యోగుల డేటా, వచ్చేవారం రిటైల్ ద్రవ్యోల్బణం ఫలితాలు వెలువడనున్నాయి.