హరిద్వార్, సెప్టెంబర్ 8: దేశంలో ఆయుర్వేదానికున్న ప్రాధాన్యాన్ని పెంచడంలో ఎంతో కృషి చేస్తున్న పతంజలి.. విదేశాలకూ దాని ప్రయోజనాలను చాటి చెప్తున్నది. ఇందులోభాగంగానే ఆస్ట్రేలియాకు చెందిన స్విన్బర్న్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, పతంజలి రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కలిసి మనుషులకు ఎన్నో ప్రయోజనాల్ని కలిగించే మంచి బ్యాక్టీరియా శరీరంలో పెరగడానికి ఆయుర్వేద ఔషధాలు ఎలా దోహదపడుతున్నాయన్న దానిపై పరిశోధనలు నిర్వహించారు. ఇప్పటికే పతంజలి అధినేత ఆచార్య బాలకృష్ణ నేతృత్వంలోని పతంజలి రిసెర్చ్ ఇన్స్టిట్యూట్..
అనేక వ్యాధుల నయానికి ప్రభావవంతమైన మూలికా వైద్యం, ఆయుర్వేద చికిత్సల్ని కనుగొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా దేశాల్లోనూ పతంజలి సహకారంతో ఆయుర్వేదం విస్తరిస్తుండటం గమనార్హం. దీంతో ఆయుర్వేదంపై విదేశాల్లో పెరుగుతున్న ఆసక్తిపట్ల పతంజలి గ్రూప్ హర్షం వ్యక్తం చేసింది. విదేశీ శాస్త్రవేత్తలు ఆయుర్వేద శక్తిని అంగీకరించడమేగాక, పరిశోధనలకూ ముందుకురావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆచార్య బాలకృష్ణ అన్నారు.