ముంబై, జూలై 29: అంతర్జాతీయ అనిశ్చితితో దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. జూలై 21తో ముగిసిన వారంలో ఈ నిల్వలు 1.987 బిలియన్ డాలర్లమేర క్షీణించి 607.035 బిలియన్ డాలర్ల వద్దకు పడిపోయాయి. అంతక్రితం వారంలో ఇవి భారీగా 12 బిలియన్ల వరకూ పెరిగినప్పటికీ, వెనువెంటనే తగ్గినట్టు తాజాగా రిజర్వ్బ్యాంక్ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రూపాయి ఒడిదుడుకుల్ని నివారించడానికి ఆర్బీఐ డాలర్లను ఖర్చుచేయడంతో ఈ తరుగుదల ఏర్పడింది.సమీక్షావారంలో కేంద్ర బ్యాంక్ డాలర్లను విక్రయించిన కారణంగా విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 2.414 బిలియన్ డాలర్ల మేర క్షీణించి 537.752 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. డాలర్ విలువలో కలిగిన మార్పులతో పాటు ఆర్బీఐ వద్దనున్న యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీలకు డాలరు మారకంలో ఏర్పడిన తరుగుదల లేదా పెరుగుదలను సైతం ఈ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు.
చాలాకాలం తర్వాత జూలై 21తో ముగిసిన వారంలో బంగారం నిల్వలు మాత్రం 417 మిలియన్ డాలర్లు పెరిగి 45.614 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్లు) 11 మిలియన్ డాలర్ల మేర పెరిగి 18.474 బిలియన్ డాలర్ల స్థాయికి పెరిగాయి. ఐఎంఎఫ్ వద్దనున్న నిల్వలు 21 మిలియన్ డాలర్ల వరకూ పెరిగి 5.196 బిలియన్ డాలర్లకు చేరాయి. 2021 అక్టోబర్లో నమోదైన 645 బిలియన్ డాలర్ల రికార్డుస్థాయిని మళ్లీ విదేశీ మారక నిల్వలు అందుకోలేకపోతున్నాయి. అప్పటి నుంచి నిలువునా పడిపోయిన రూపాయి పతనాన్ని నిరోధించడానికి రిజర్వ్బ్యాంక్ డాలర్లను విక్రయిస్తూ వచ్చింది. దీంతో ఒకదశలో రిజర్వులు 500 బిలియన్ డాలర్లస్థాయికి సైతం పడిపోయాయి.