Ford | ఫోర్డ్.. అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం.. మూడేండ్ల క్రితం 2021లో నిష్క్రమించినా.. తిరిగి భారత్ మార్కెట్లో ఎంటర్ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రత్యేకించి భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల తయారీపై ఫోకస్ చేస్తున్నది. చెన్నైలోని మాన్యుఫాక్చరింగ్ యూనిట్లోని వసతులను వినియోగించుకోవాలని తలపోస్తున్నట్లు ఒక ఆంగ్ల దిన పత్రిక పేర్కొంది. దేశంలో పాపులర్ ఎస్యూవీ కార్లుగా ఉన్న హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు స్లీక్, మోడ్రన్ మిడ్ సైజ్ ఎస్యూవీలను డిజైన్ చేయాలని ఫోర్డ్ భావిస్తున్నట్లు మరో వార్తా కథనం ప్రచురితమైంది.
చెన్నై ఫ్యాక్టరీ యూనిట్లో సిబ్బందిని నియమించుకోవాలని భావిస్తున్నారు. ‘ముస్తాంగ్ మాచ్-ఈ’ ట్రేడ్ మార్కును ఫోర్డ్ పొందింది. మెర్సిడెస్ ఈక్యూఈ, బీఎండబ్ల్యూ ఐఎక్స్, ఆడి క్యూ8 ఈ-ట్రాన్ వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లకు పోటీగా ఎలక్ట్రిక్ క్రాస్ ఓవర్ కారును మార్కెట్లోకి తేనున్నది. ఇంతకుముందు జేఎస్ డబ్ల్యూ గ్రూప్ సంస్థకు చెన్నై ప్రొడక్షన్ యూనిట్ విక్రయంపై ఫోర్డ్ కంపెనీతో చర్చలు జరిగాయి. కానీ, తర్వాత ఈ విక్రయ ప్రణాళికను ఫోర్డ్ నిరవధికంగా వాయిదా వేసింది.