Ford India | భారత్ నుంచి శాశ్వతంగా వైదొలగాలని అమెరికా కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ నిర్ణయించుకున్నది. ఇంతకుముందు భారత్లో కార్ల ఉత్పత్తి నిలిపేయాలని నిర్ణయించినా.. విద్యుత్ వాహనాల తయారీకి ప్రణాళికలు రూపొందించామని, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీం కింద అనుమతించాలని కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నది. కేంద్రం కూడా పీఎల్ఐ అప్లికేషన్కు ఆమోదం తెలుపడంతో ఫోర్డ్ తిరిగి దేశంలో కార్ల ఉత్పత్తి కొనసాగిస్తుందని అంతా భావించారు. కానీ, భారత్లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్రణాళిక ఉపసంహరించుకుంటున్నట్లు గురువారం ప్రకటించింది ఫోర్డ్. పీఎల్ఐ స్కీం కింద దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఎటువంటి ఆలోచన లేదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.
చాలా జాగ్రత్తగా సమీక్షించిన తర్వాత భారత్లోని ఉత్పాదక యూనిట్ల నుంచి ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయాలన్న ప్రణాళికను కొనసాగించరాదని నిర్ణయించామని ఫోర్డ్ ఓ ప్రకటనలో తెలిపింది. తమ పీఎల్ఐ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. ఇంతకుముందు తమ వ్యాపార ప్రణాళికలను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు పేర్కొంది.
ఫోర్డ్ ఇండియాతోపాటు 20 ఇతర ఆటోమొబైల్ సంస్థలు పీఎల్ఐ స్కీం కింద ఎంపికయ్యాయి. ఈ పథకం కింద కేంద్రం సదరు ఆటోమొబైల్ కంపెనీలకు రూ.45,016 కోట్లు చెల్లించనున్నది. భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఆటోమేకర్లను ఆకర్షించేందుకు కేంద్రం ఈ పీఎల్ఐ స్కీం తీసుకొచ్చింది.
గతేడాది సెప్టెంబర్లో భారత్లో వాహనాల ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు ఫోర్డ్ ఇండియా తెలిపింది. కానీ భారత్ ఆపరేషన్స్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇంజిన్ తయారీ, టెక్నాలజీ సర్వీసెస్ బిజినెస్ (గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్) కొనసాగిస్తామని ప్రకటించింది. దీనివల్ల 4,000 మంది ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడనుంది. తమిళనాడు, గుజరాత్లలో ఫోర్డ్కు ప్రొడక్షన్ యూనిట్లు ఉన్నాయి.