Pre-Budget Consultation | వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) బడ్జెట్ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నుంచి వివిధ రంగాల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపనున్నారు. తొలుత వ్యవసాయం, అగ్రి-ప్రాసెసింగ్ పరిశ్రమ నిపుణులతో భేటీ కానున్నారు. కరోనా మహమ్మారి ప్రభావంతో దెబ్బతిన్న ఎకానమీ గ్రోత్ను గాడిలో పెట్టడం ప్రభుత్వం ముందున్న లక్ష్యం. అలాగే ప్రజల్లో వినియోగ శక్తిని పెంపొందించేందుకు నిర్మలా సీతారామన్ పారిశ్రామిక సంస్థల సంఘాలు, రైతు సంఘాలు, ఆర్థిక వేత్తలు సహా అన్ని వర్గాల అభిప్రాయాలను స్వీకరిస్తారు. ఈ సమావేశాలన్నీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో డబుల్ డిజిట్ గ్రోత్ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ఇటీవలే ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ 9.5 శాతంగా ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. జీడీపీలో ద్రవ్యోల్బణం వాటా 6.8 శాతానికి పెరుగుతుందని అంచనాలు వెలువడుతున్నాయి.
ఉద్యోగాల కల్పన, వృద్ధిరేటు స్థిరంగా 8 శాతానికి పైగా నమోదుకు తీసుకోవాల్సిన చర్యలపై బడ్జెట్లో కీలకం కానున్నాయి. ప్రస్తుతం కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్న తరుణంలో వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. శరవేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతున్న నేపథ్యంలో ఒమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.