న్యూఢిల్లీ : వృద్ధి రేటును బలోపేతం చేయడంలో మేథో సంపత్తి హక్కులు (ఐపీఆర్) కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2013-14లో 4000 పేటెంట్లు మంజూరు కాగా గత ఏడాది 28,000 పేటెంట్లు మంజూరయ్యాయని మంత్రి పేర్కొన్నారు.
గత ఏడాది 2.5 లక్షల ట్రేడ్మార్క్లు, 16,000 కాపీరైట్లు నమోదయ్యాయని, ఇది ఆర్ధిక వ్యవస్ధపై సానుకూల ప్రభావం చూపుతుందని ఆమె అన్నారు. ఇవి చిన్న గణాంకాలు కాదు..ఇవి మన ఆర్ధిక వ్యవస్ధ పటిష్టతకు సంకేతమని వ్యాఖ్యానించారు.
ఇంత భారీస్ధాయిలో కాపీరైట్లు, వినూత్న పోకడలతో ఆర్ధిక వ్యవస్ధలో ఉత్తేజం నెలకొంటుందని, వీటి ద్వారా భారీ రాబడులు సమకూరుతాయని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీ హైకోర్టు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొంటూ మేథో సంపత్తి హక్కుల ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఇతర న్యాయమూర్తులు హాజరయ్యారు.