హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): దేశంలోనే మొట్టమొదటి ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్ (ఎఫ్సీటీ హబ్) రాష్ట్రంలో ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, లారస్ ల్యాబ్స్ సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేశాయి. ఔషధాల తయారీకి సంబంధించి పరిశోధన-అభివృద్ధి (ఆర్అండ్డీ)లో ఉపయోగపడే ఈ హబ్ను బుధవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ శేరిలింగంపల్లిలోని డాక్టర్ రెడ్డీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ (డీఆర్ఐఎల్ఎస్)లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుళ పరిశ్రమ అవసరాలకు ఉపయోగపడే ఈ హబ్ మన దేశంలో మొట్టమొదటిదన్నారు. కాగా, ఈ హబ్ను జీవశాస్ర్తాల రంగంలో ఒక మైలురాయిగా పరిశ్రమ వర్గాలు అభవర్ణిస్తున్నాయి. అత్యాధునిక పరికరాలు, మౌలిక సదుపాయాలతోకూడిన ఈ కేంద్రం.. పరిశోధన, అభివృద్ధికి, ముఖ్యంగా యాక్టివ్ ఫార్మా పదార్థాల (ఏపీఐ) తయారీకి సంబంధించి శాస్త్రీయ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు దోహదపడుతుందని పేర్కొంటున్నాయి.