Flipkart Layoffs | పేటీఎం.. స్విగ్గీ తదితర సంస్థల బాటలో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ‘ఫ్లిప్కార్ట్’ పయనిస్తోంది. సుమారు వెయ్యి మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఉద్యోగుల పనితీరు ఆధారంగా తొలగింపు ప్రక్రియ చేపట్టినట్లు ఫ్లిప్ కార్ట్ వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల దిన పత్రిక తెలిపింది.
ఇప్పుడు కంపెనీలో సుమారు 22 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో ఐదు శాతం మంది ఉద్యోగులకు లే-ఆఫ్ ప్రకటించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఖర్చు ఆదా చర్యల్లో భాగంగా ప్రతి ఏటా ఉద్యోగులను తొలగిస్తున్నది.
ఇటీవల కంపెనీ ఉద్యోగులతో సమావేశమైన ఫ్లిప్ కార్ట్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి సంస్థ ఆర్థికంగా మెరుగు పడిందని చెప్పారు. వచ్చే ఏడాది ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్కు సన్నద్ధం అవుతున్నదని ఫ్లిప్ కార్ట్ వర్గాలు తెలిపాయి.