Flipkart Layoffs | ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ నిత్యావసరాల కొనుగోలుకు ఆన్లైన్లోనే కొనుగోళ్లు చేస్తున్నారు. ఆన్లైన్ సేల్స్లో పేరొందిన ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ సైతం పొదుపు చర్యలు చేపట్టింది. సిబ్బంది పనితీరు ఆధారంగా ఐదు శాతం ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఏడాది కాలంగా కొత్త నియామకాలను నిలిపివేసింది. గత రెండేండ్లుగా వార్షిక పనితీరు ఆధారంగా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నది. తన నియంత్రణ చర్యలను వచ్చే మార్చి-ఏప్రిల్ నాటికి ముగించాలని భావిస్తున్నది. మైంత్రా మినహా ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో 22 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. తాజాగా ఖరారు చేసిన లే-ఆఫ్ ప్లాన్ ప్రకారం 1100-1500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకనున్నదని తెలుస్తున్నది.
ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ ద్వారా నిధులు సమకూర్చుకోవాలని ఫ్లిప్కార్ట్ యోచిస్తున్నది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపుతో సంబంధం లేకుండా ఈ ఏడాది చివరి వరకూ తన ‘ఐపీవో’ ప్లాన్ వాయిదా వేయాలన్న ఆలోచనలో తేడా లేదని సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు చెబుతున్నారు. ఇప్పటికే ఫిన్టెక్ సంస్థ పేటీం, ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్, మీషో వంటి సంస్థలు కూడా పొదుపు చర్యలతోపాటు సంస్థ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. ఇక అదానీ గ్రూపుకు 20 శాతం వాటా గల క్లియర్ ట్రిప్తో సహకార ఒప్పందం కోసం ఫ్లిప్ కార్ట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
క్లియర్ ట్రిప్ సంస్థ ప్రత్యేకించి విమానాల టికెట్ల బుకింగ్పై ఫోకస్ చేస్తున్నది. ఫ్లిప్ కార్ట్ నుంచి వస్తున్న పెట్టుబడులను హోటల్ బిజినెస్లో పెంచే అవకాశాలు ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ తన మాతృ సంస్థ వాల్మార్ట్, ఇతర సంస్థల నుంచి వచ్చే 100 కోట్ల డాలర్ల ఫండ్.. సంస్థ వ్యూహాత్మక ప్రణాళికలను మద్దతుగా నిలుస్తుందని భావిస్తున్నారు.