Investments | ఇన్వెస్టర్లైనా.. సాధారణ వేతన జీవులైనా తమకంటూ భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. జీవితంలో ప్రతి ఒక్కరూ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. భార్యా పిల్లలు.. తల్లిదండ్రుల ఆరోగ్య పరీక్షలకు భారీగా డబ్బు అవసరాలు కావచ్చు.. లేదా పిల్లలు ఉన్నత విద్యా కోర్సుల్లో చేర్చడానికి నిధి అవసరం కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబ నిర్వహణకు ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఆర్థిక వేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు.
ప్రత్యేకించి ఇన్వెస్టర్లలో 30 శాతం మంది మున్ముందు ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా ఇబ్బందుల్లేకుండా చూసుకునేందుకు తమ ఫైనాన్సియల్ ప్లాన్లో ఎమర్జెన్సీ నిధి ఏర్పాటు చేసుకోవడానికి ప్రియారిటీ ఇస్తున్నారు. అలా ఎమర్జెన్సీ ఫండ్స్గా పరిగణించే ఇన్వెస్ట్మెంట్ టూల్స్.. ఫిక్స్డ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్స్.. నికరమైన, స్థిరమైన రాబడికి ఏ పథకంలో పొదుపు చేయాలన్న అంశంపై కొందరు మదుపర్లు ఆందోళనకు, గందరగోళానికి గురవుతున్నారు. అలా కన్ఫ్యూజ్ కాకుండా ఏం చేయాలో తెలుసుకుందాం..
స్థిరంగా, నికరమైన రిటర్న్స్ ఇచ్చే పెట్టుబడి పథకాలు లిక్విడ్ ఫండ్స్.. 91 రోజులు, మూడు నెలల గడువు గల ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, బాండ్లు, డిబెంచర్ల వంటి సెక్యూరిటీ ఫండ్స్నే లిక్విడ్ ఫండ్స్ అంటారు. వీటిల్లో నిర్దిష్ట కాలం పెట్టుబడులు మదుపు చేయాలన్న లాక్ ఇన్ పీరియడ్ ఉండదు. అత్యవసరమైనప్పుడు ముందస్తుగా విత్ డ్రాయల్ చేసుకోవచ్చు. ఈ ఫండ్స్లో నగదు లభ్యత ఎక్కువగా ఉంటుంది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ రాబడిపై చట్టానికి లోబడి పన్ను వర్తిస్తుంది.
పలు బ్యాంకులు ఏడు రోజుల నుంచి పదేండ్ల లోపు వివిధ టెన్యూర్లతో రూ.2 కోట్ల లోపు వరకు కస్టమర్ల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లను ఆహ్వానిస్తున్నాయి. స్వల్పకాలిక ఫిక్స్డ్ డిపాజిట్లపై సేవింగ్స్ అకౌంట్స్ వడ్డీ పొందొచ్చు. ఏడాది నుంచి రెండేండ్ల వరకు ఇన్వెస్ట్ చేస్తే కొంచెం బెటర్ రిటర్న్స్ లభిస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్లకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ముందస్తుగా (ప్రీ-మెచ్యూర్డ్) విత్ డ్రా చేసుకుంటే పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. వడ్డీ ఆదాయం తగ్గుతుంది.
ఎమర్జెన్సీ ఫండ్స్లో ప్రధానంగా నగదు లభ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. అది లిక్విడ్ ఫండ్స్లో తేలిక అవుతుంది. కొన్ని సంస్థలు తమ లిక్విడ్ ఫండ్స్ స్కీమ్ల్లో పెట్టుబడి పెట్టిన వారికి ఏటీఎం కార్డులు కూడా ఇస్తున్నాయి. కనుక ఇన్వెస్టర్లు ఏక్షణంలోనైనా డబ్బు విత్ డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది.
నిర్దిష్ట గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై లాక్ ఇన్ పీరియడ్ అమల్లో ఉంటుంది. ఇప్పుడంతా డిజిటల్ లావాదేవీలే జరుగుతున్నందున ఆన్లైన్లోనే మదుపర్లు తమ ఫిక్స్డ్ డిపాజిట్లు రీడీమ్ చేసుకునే ఫెసిలిటీ అందుబాటులో ఉంది. అలా చేయడం వల్ల పెనాల్టీ లేకుండానే నగదు కస్టమర్ల సేవింగ్స్ ఖాతాలో జమ అవుతుంది. కొన్ని బ్యాంకులు కస్టమర్లకు స్వీప్ ఇన్ ఫెసిలిటీ కల్పిస్తున్నాయి. ఆయా ఖాతాదారుల సేవింగ్స్ ఖాతాలో నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్లలోకి వెళ్లిపోతాయి. కావాల్సిన డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు.
ఎమర్జెన్సీ ఫండింగ్ కోసం పొదుపు చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్లలో జమ చేయొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్లలో నష్టభయం తక్కువగానే ఉంటుంది. లిక్విడ్ ఫండ్స్లో నష్టభయం ఉండదని చెప్పలేం. బ్యాంకుల్లో డిపాజిట్లపై రూ.5 లక్షల వరకు బీమా కవరేజీ ఉంటుంది. కనుక ఫిక్స్డ్ డిపాజిట్లపై నష్టాలు వస్తాయని భయపడాల్సిన అవసరం లేదని ఆర్థికవేత్తలు, నిపుణులు చెబుతున్నారు.
ఇక ఏడాది టెన్యూర్ గల లిక్విడ్ ఫండ్లపై నాలుగు నుంచి 4.5 శాతం ఇన్కం ఆశించవచ్చు. ఇప్పుడు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచడం వల్ల 5.25 శాతం వరకు ఆదాయం పొందొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది కనుక వడ్డీరేట్లు స్థిరంగా ఉంటాయి. లిక్విడ్ ఫండ్లలో వడ్డీ రేట్లలో మార్పులు చేర్పులకు అనుగుణంగా ఆదాయం లభిస్తుంది.
ఆదాయం పన్ను చట్టం ప్రకారం ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం రూ.40 వేలు దాటితే శ్లాబ్ ప్రకారం టీడీఎస్ విధిస్తారు. సీనియర్ సిటిజన్లకు రూ.50 వేల వరకు పన్ను రాయితీ ఉంటుంది. వడ్డీ ఆదాయం ఎక్కువగా ఉన్నా.. వార్షిక ఆదాయం పన్ను చట్టానికి లోబడి ఉంటే 15జీ/ హెచ్ ఫామ్ సబ్మిట్ చేసి పన్ను రాయితీ పొందొచ్చు. ఐదేండ్ల పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు.
లిక్విడ్ ఫండ్స్లో పెట్టుబడులను మూడేండ్ల లోపు విత్ డ్రా చేసుకుంటే ఆదాయం పన్ను చట్టం స్లాబ్ ప్రకారం పన్ను పే చేయాల్సి ఉంటుంది. అంత కంటే ఎక్కువ కాలం పెట్టుబడులు కొనసాగిస్తే 20 శాతం టాక్స్ చెల్లించాలి. ఏడాది నుంచి మూడేండ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై మంచి రిటర్న్స్ లభిస్తాయి. లిక్విడ్ ఫండ్స్లో మూడు నెలల నుంచి ఆరు నెలల్లోపు వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతకు మించి ఎక్కువ కాలం పొదుపు చేయాలనుకుంటే డెట్ ఫండ్స్లో మదుపు చేయడం బెటర్ అని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇక మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు పూర్తిగా అవగాహన చేసుకున్నాకే ముందడుగు వేయాలని సూచిస్తున్నారు.