Petrol Saving with Credit Card | పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలు సగటు పౌరులకు అదనపు కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. పెట్రోల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు భారం అవుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ప్రియం అవుతున్నాయి. ఇటీవల కేంద్రం కొంత ఎక్సైజ్ సుంకం తగ్గించినా పెట్రోల్ ధరలు మూడంకెల్లోనే కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్రోల్ వినియోగదారులకు కాస్త ఊరట కల్పించేందుకు బ్యాంకులు.. ఇంధన ఆధారిత క్రెడిట్ కార్డు సేవలందిస్తున్నాయి. కస్టమర్లు ప్రణాళిక ప్రకారం క్రెడిట్ కార్డును వాడుకుంటే అన్ని రకాల బెనిఫిట్లు పొందొచ్చు. స్తోమత దాటి ఖర్చు చేస్తే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. గడువులోగా చెల్లించకపోతే 28-49 శాతం వడ్డీ ప్లస్ ఫైన్ చెల్లించాలి. కనుక పెట్రోల్ సంస్థల భాగస్వామ్యంతో జారీ చేసే క్రెడిట్ కార్డులను ప్రణాళిక ప్రకారం వాడుకోవాలి. అలా వాడుకుంటే పెట్రోల్పై చేసే ఖర్చులో కొంత తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం..
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) సహకారంతో దేశంలోకెల్లా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ తీసుకొస్తున్న బీపీసీఎల్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడకంతో.. బీపీసీఎల్ పెట్రోల్ బంకుల్లో ప్రతి నెలా రూ.100 వరకు సర్ చార్జీ రద్దవుతుంది. పథకం ప్రకారం వాడుకుంటే ఏడాదిలో 70 లీటర్ల వరకు ఆదా చేయొచ్చు. డైనింగ్, నిత్యావసరాలు, సినిమా టికెట్లు, డిపార్ట్మెంట్ స్టోర్లలో ప్రతి రూ.100 వినియోగంపై ఐదు రివార్డు పాయింట్లు, ఇంధనేతర వస్తువులపై ఖర్చు చేసే రూ.100పై ఒక రివార్డ్ పాయింట్ లభిస్తుంది. అంతే కాదు బిల్లు రూ.2,500 దాటితే ఈఎంఐలుగా మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. కార్డు పొందడానికి రూ.499 చెల్లిస్తే సరి. ఏడాది వార్షిక ఫీజు రూ.499 ఉంటుంది. కార్డు తీసుకోగానే రూ.500 విలువ గల 2000 పాయింట్లు లభిస్తాయి.
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంకు జారీ చేసే భారత్ క్రెడిట్ కార్డుతో నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, ఐఆర్సీటీసీ ట్రాన్సాక్షన్స్, మొబైల్ ఫోన్ల రీచార్జీ, ఇతర బిల్లుల పేమెంట్స్పై ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. పెట్రోల్ పంపుల్లో కనీసం రూ.400 ట్రాన్సాక్షన్ జరిపితే ఒకశాతం సర్చార్జీ రద్దవుతుంది. గరిష్ఠంగా రూ.250 వరకు సర్చార్జీ రద్దు చేసుకోవచ్చు. కార్డు పొందడానికి గానీ, వార్షిక ఫీజుగా గానీ రూ.500 చె్లించాలి. రూ.50 వేలు దాటితే వార్షిక ఫీజు రద్దవుతుంది. రూ.50 లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తున్నది.
యాక్సిస్ బ్యాంకు భాగస్వామ్యంతో జారీ చేసే ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపుల్లో చేసే ప్రతి రూ.100 లావాదేవీపైనా 20 రివార్డు పాయింట్లు లభిస్తాయి. ప్రతినెలా కనీసం రూ.100 ఖర్చు చేయాలి. రూ.200 నుంచి రూ.5000 మధ్య చేసే ఇంధన లావాదేవీలపై ఒక శాతం సర్ఛార్జి రద్దవుతుంది. యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్య రెస్టారెంట్లలో చేసే డైనింగ్ బిల్లులపై 20 శాతం రాయితీ పొందొచ్చు. రూ.500 చెల్లించి కార్డు పొందొచ్చు. వార్షిక ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్బీఐ సహకారంతో జారీ చేసే బీపీసీఎల్ ఎస్బీఐ అక్టేన్ క్రెడిట్ కార్డుతో బీపీసీఎల్ పెట్రోల్ పంపుల్లో చేసే ప్రతి రూ.100 ఖర్చు మీద 25 రివార్డు పాయింట్లు లభిస్తాయి. బీపీసీఎల్ పెట్రోల్ పంపుల్లో నిర్ణీత పరిమితి దాటి ఖర్చు చేస్తే ఒకశాతం సర్ చార్జీ రద్దవుతుంది. నిత్యావసర దుకాణాల్లో ప్రతి రూ.100 కొనుగోలుపైనా 10 రివార్డు పాయింట్లు వస్తాయి. రూ.1499 చెల్లించి కార్డు తీసుకోవచ్చు. ప్రతియేటా రూ.1,499 వార్షిక ఫీజు చెల్లిస్తూ ఉండాలి.
సిటీ బ్యాంకు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో జారీచేసే సిటీ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ ప్లాటినం కార్డుతో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపుల్లో ప్రతి రూ.150 ఖర్చుపై నాలుగు టర్బో పాయింట్లు లభిస్తాయి. ఇంధన లావాదేవీపై ఒకశాతం సర్ చార్జీ రద్దవుతుంది. సూపర్ మార్కెట్లలో రూ.150 ఖర్చుపై రెండు టర్బో పాయింట్లు వస్తాయి. రూ.1000 చెల్లించి కార్డు తీసుకోవచ్చు. ప్రతిఏటా రూ.1000 వార్షిక ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది పొడవునా రూ.30 వేల పై చిలుకు క్రెడిట్ కార్డును వాడుకుంటే వార్షిక ఫీజుతోపాటు కార్డు కొనుగోలు రుసుము రద్దవుతుంది.