న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: దేశ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణం ముప్పు పొంచి ఉన్నదని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ గురువారం హెచ్చరించింది. ఎల్నినో కారణంగా ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవచ్చని, దీంతో పంట దిగుబడులు తగ్గి ఆహార ద్రవ్యోల్బణం పెచ్చుమీరిపోయే వీలుందని అభిప్రాయపడింది. భారత్లో వ్యవసాయం ఎక్కువగా వర్షాధారమేనన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వర్షాకాలం సగం ముగిసిపోయింది. అయినప్పటికీ వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. అయితే కొన్నిచోట్ల అధిక వర్షాలు, మరికొన్నిచోట్ల వానలు లేకపోవడం కూడా పంట దిగుబడులను ప్రభావితం చేస్తున్నాయి.
ద్రవ్యోల్బణం పెరిగితే..
ద్రవ్యోల్బణం పెరిగితే దాన్ని అదుపులో పెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠిన ద్రవ్య విధానాన్ని అవలంభించాల్సి వస్తుంది. దీంతో వడ్డీరేట్లు పెరిగిపోయి.. మార్కెట్లో ద్రవ్యలభ్యత తగ్గిపోతుంది. ఫలితంగా ఆయా రంగాలకు రుణాలు దూరమవుతాయి. ఇది దేశ ఆర్థిక వృద్ధిరేటును ఆటంకపరుస్తుంది. ఇప్పటికే కరోనాకు ముందు న్న స్థాయిని మించి రుణాలపై వడ్డీరేట్లున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను ఇంకా పెంచితే ఇబ్బందేనన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. గడిచిన ఏడాదికిపైగా కాలంలో ఆర్బీఐ రెపోరేటును 250 బేసిస్ పాయింట్లు పెంచినది తెలిసిందే. కాగా, ద్రవ్యోల్బణం వల్ల వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం పడిపోతుందని ఫిచ్ రేటింగ్స్ చెప్పింది. ఇది ఆయా ఉత్పత్తుల అమ్మకాలను దెబ్బ తీస్తుందన్నది.
వృద్ధి అంచనా యథాతథం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను దేశ జీడీపీ వృద్ధి అంచనాను ఫిచ్ రేటింగ్స్ యథాతథంగానే ఉంచింది. 6.3 శాతంగానే ఉండొచ్చన్నది. ఆర్బీఐ కఠిన ద్రవ్య విధానాన్ని అనుసరిస్తున్నా.. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతనే ప్రదర్శిస్తున్నదన్న ఫిచ్ రేటింగ్స్.. పడిపోతున్న ఎగుమతులు జీడీపీ పెరుగుదలకు విఘాతం కలిగిస్తున్నట్టు పేర్కొన్నది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) దేశ వృద్ధిరేటు 6.5 శాతంగా నమోదు కావచ్చని చెప్పింది.