ముంబై, ఏప్రిల్ 18 : గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. భారత్లో తమ తొలి స్టోర్ను తెరిచింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో సంస్థ సీఈవో టిమ్ కుక్ చేతులమీదుగా మంగళవారం ప్రారంభమైంది. ఈ స్టోర్లో తొలి అడుగు పెట్టేందుకు వందలాది యాపిల్ ఫోన్ ప్రేమికులు పోటీపడగా.. కొందరైతే సోమవారం రాత్రి నుంచే పడిగాపులుగాయడం గమనార్హం. కస్టమర్లను కుక్ స్వయంగా ఆహ్వానించడం, వారిని ఆలింగనం చేసుకొని సెల్ఫీలు దిగడం ఆకట్టుకున్నది. ఓ స్థానిక డిజైనర్ తన వద్దనున్న దాదాపు 40 ఏండ్ల కిందటి మ్యాక్ క్లాసిక్ మెషీన్తో రావడాన్ని చూసిన టిమ్ కుక్ సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
‘ముంబైలోని ఈ శక్తి, సృజనాత్మకత, ఇష్టం.. అసామాన్యం. భారత్లో మా తొలి స్టోర్ను తెరవడం ఎంతో ఆనందంగా ఉన్నది’ అని కుక్ ట్వీట్ చేశారు. ఇక ముకేశ్ అంబానీకి చెందిన ముంబైలో జియో వరల్డ్ డ్రైవ్ మాల్లోనే ముంబై యాపిల్ స్టోర్ రాగా.. 11 ఏండ్లపాటు కాంట్రాక్టు కుదిరింది. 20వేలకుపైగా చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ స్పేస్కు నెలకు యాపిల్ రూ.42 లక్షల అద్దె చెల్లించనుండగా, ఇక్కడి ఆదాయంలోనూ ముకేశ్ అంబానీకి వాటా దక్కనున్నది. ఇప్పటిదాకా ఇతర భాగస్వాములతో కలిసి భారత్లో యాపిల్.. తమ ఫోన్లు, ట్యాబ్లు, స్మార్ట్ వాచీలు తదితర ఉత్పత్తులను అమ్మిన విషయం తెలిసిందే.