చెన్నై: భారత్లోకి వాహనాలను దిగుమతి చేయాలని భావించేవారు.. దేశీయంగా పెట్టుబడులు పెట్టాలని ఓలా ఎలక్ట్రిక్ చైర్మన్ కం సీఈవో భవిష్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఆదివారం తమిళనాడులో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను విపణిలోకి ఆవిష్కరించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకాలను తగ్గించాలని గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తొలి నుంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాహనాలపై ఇంపోర్ట్ డ్యూటీ తగ్గింపునకు ఓలా ఎలక్ట్రిక్ వ్యతిరేకంగా ఉన్నది.
భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి టెస్లా సీఈవో ఎలన్మస్క్కు స్వాగతం పలుకుతున్నానని భవిష్ అగర్వాల్ చెప్పారు. దేశీయంగా టెక్నాలజీ, పర్యావరణ మిత ఉత్పత్తి పెరుగుతుందన్నారు. ఆటోమొబైల్ రంగంలో ఆరోగ్యకరమైన పోటీ ఉందని, దీంతో దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ సుస్థిర విప్లవం సాధిస్తుందన్నారు.
వచ్చే నాలుగేండ్లలో అంటే, 2025 నాటికి భారత్లో పెట్రోల్ వినియోగ టూ వీలర్ విక్రయాలు ఉండొద్దని భవిష్ అగర్వాల్ చెప్పారు. ఈ నాలుగేండ్లలో పెట్రోల్ నుంచి విద్యుత్ వినియోగ వాహనాల్లోకి పరివర్తన తీసుకు రావాలన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ ఉమ్మడిగా కలిసి పని చేస్తే భారత్ను విద్యుద్దీకరణలో గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దొచ్చునన్నారు. దేశీయ వాహనాల విద్యుద్దీకరణ చాలా అత్యవసరం అని పేర్కొన్నారు.