Gold Loans | న్యూఢిల్లీ, మార్చి 13: బంగారాన్ని తాకట్టు పెట్టుకొని ఇచ్చిన రుణాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు ఆయా బ్యాంకుల అధిపతులకు ఆర్థిక సేవల శాఖ (డీఎఫ్ఎస్) నుంచి సమాచారం అందింది. ‘గోల్డ్ లోన్ బిజినెస్పై సమగ్ర సమీక్ష చేపట్టాలని మేము బ్యాంకులను కోరాం’ అని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోష్ పీటీఐతో అన్నారు. అయితే నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్టు ప్రభుత్వం దృష్టికి రావడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. కాగా, ఫీజుల వసూలు, వడ్డీరేట్లు, గోల్డ్ లోన్ ఖాతాల మూసివేత వంటి వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని గత నెలే బ్యాంకులకు ఆర్థిక శాఖ సలహా ఇచ్చినట్టు సమాచారం. బంగారాన్ని తనఖా పెట్టుకోకుండానే రుణాలిచ్చినట్టు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి రావడం గమనార్హం. దీంతో 2022 మొదలు ఈ ఏడాది జనవరి ఆఖరుదాకా ఇచ్చిన గోల్డ్ లోన్లలో అవకతవకలు ఏవైనా జరిగాయా? నిబంధనల్ని సరిగ్గా పాటించారా? అన్న కోణంలో దృష్టి పెట్టాలని బ్యాంకులకు ఓ లేఖ ద్వారా డీఎఫ్ఎస్ ఆదేశాలిచ్చింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం.. ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం విలువలో 75 శాతాన్ని మించి రుణాలుగా బ్యాంకులు ఇవ్వరాదు. గోల్డ్ లోన్లను ఇస్తున్న ఇతర బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకూ ఇదే వర్తిస్తుంది. అయితే కరోనా సమయంలో మాత్రం ఈ నిబంధనల్ని ఆర్బీఐ సడలించింది. 90 శాతానికి పెంచింది. కానీ 2020 ఆగస్టు నుంచి 2021 మార్చి 31 వరకే ఈ అవకాశం ఇచ్చింది. ఇదిలావుంటే ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ను ఆర్బీఐ ఇటీవలే గోల్డ్ లోన్లు ఇవ్వకుండా నిషేధించిన సంగతి విదితమే. వివిధ రకాల పర్యవేక్షణ లోపాలే కారణం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి వచ్చిన సూచనలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
గోల్డ్ లోన్ వ్యాపారంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముందున్నది. గత ఏడాది డిసెంబర్ ఆఖరుకల్లా బ్యాంక్ పోర్ట్ఫోలియో రూ.30,881 కోట్లుగా ఉన్నది. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రూ.5,315 కోట్లుగా, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రూ.3,682 కోట్లుగా ఉన్నాయి. కాగా, బంగారం ధరలు దేశీయ మార్కెట్లో ఇటీవల ఆల్టైమ్ హైకి చేరుకున్నది తెలిసిందే. 24 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి రేటు ఏకంగా మునుపెన్నడూ లేనివిధంగా రూ.67,705 పలికింది. కేవలం నెల రోజుల్లోనే తులం విలువ రూ.4,240 పుంజుకోవడం విశేషం.