లుథియానా, ఏప్రిల్ 9 : దేశీయ వస్తూత్పత్తి ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 2-3 శాతం క్షీణించవచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) అంచనా వేస్తున్నది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఏర్పడిన అనిశ్చిత పరిస్థితులు ఇందుకు కారణమని ఎఫ్ఐఈవో అధ్యక్షుడు ఎస్సీ రల్హాన్ గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. గత నెల మార్చి ఎగుమతుల్లో 7-8 శాతం పతనం చూసే వీలుందన్నారు. ఈ నెల 15న కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ 2025-26కు సంబంధించి దేశీయ ఎగుమతి-దిగుమతి గణాంకాలను వెల్లడించనున్న నేపథ్యంలో ఎఫ్ఐఈవో అంచనాలు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడి చేయడంతో యుద్ధం మొదలైన విషయం తెలిసిందే.
అప్పట్నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతుల్లో అంతరాయం కలుగుతున్నది. అంతేగాక నౌకలు, విమానాల్లో సరుకు రవాణా ఖర్చులు పెరుగడం, బీమా ఖరీదెక్కడం జరిగిపోయాయి. కీలకమైన హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడం.. సముద్ర రవాణాకు ఇబ్బందుల్ని తెచ్చిపెట్టింది. అలాగే అమెరికా-ఇజ్రాయెల్కు అండగా ఉంటున్నారని పొరుగు దేశాలపై ఇరాన్ దాడులకు దిగడంతో ఆయా దేశాలు తమ గగనతలాలపై ఆంక్షల్ని తీసుకురావడం.. విమానాల్లో సరుకు రవాణా వ్యయాన్ని పెంచేసింది. ఇక దేశీయ ఇంధన అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండగా, మెజారిటీ వాటా సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్ తదితర దేశాలదే. అయితే ఈ దేశాల్లోని ముడి చమురు, సహజ వాయువు ఉత్పాదక కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగిస్తుండటంతో ఉత్పత్తి ఆగిపోయింది.
దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగిపోయాయి. ఫలితంగా ఉక్కు, ప్లాస్టిక్, రబ్బర్ తదితర ముడి సరుకుల ధరలూ పెరిగాయని, ఇవన్నీ కూడా అంతిమంగా ఎగుమతుల్నే ప్రభావితం చేస్తున్నాయని రల్హాన్ వివరించారు. అయితే దేశీయ వస్తూత్పత్తి, సేవల ఎగుమతుల్ని కలిసి చూసినైట్టెతే గత ఆర్థిక సంవత్సరం 5-6 శాతం పెరుగుదల కనిపించవచ్చని చెప్పారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఎగుమతులు 825 బిలియన్ డాలర్లు (వస్తూత్పత్తి ఎగుమతులు 437 బిలియన్ డాలర్లు, సేవల ఎగుమతులు 388 బిలియన్ డాలర్లు)గా ఉన్నాయి. కాగా, అమెరికా-ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ సంధితో నౌకల్లో సరుకు రవాణా తిరిగి ప్రారంభం కాగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా రల్హాన్ వ్యక్తం చేశారు. అయితే అధిక వడ్డీరేట్లు ఎగుమతిదారులకున్న రుణ లభ్యత అవకాశాలను దెబ్బతీస్తున్నాయని, ప్రభుత్వం ఈ విషయంలో ఊరట కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.