ప్రధాని నరేంద్రమోదీ మేడిన్ ఇండియా అంటారు. కానీ ఆయన సారధ్యంలోని టెలికం శాఖ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. కేరళలోని కోచ్చి – కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ను అనుసంధానించేందుకు 1,772 కి.మీ. పొడవునా ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ నిర్మాణం చేపట్టింది. ఇది వ్యూహాత్మకంగా దేశానికి ముఖ్యమైంది. రూ.1,072 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా భారత్ కంపెనీలు పాల్గొనకుండా డాక్యుమెంట్ సిద్ధం చేశారని డీఆర్డీవో మాజీ చీఫ్.. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ అభియోగం. దేశీయ కంపెనీలు పాల్గొనకుండా రూపొందించిన టెండర్ విధానంతో ఈ ప్రాజెక్టు విశ్వసనీయతే ప్రశ్నార్థకం అంటున్నారాయన. దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందంటున్నారు. అందుకే వివక్షాపూరితంగా తయారుచేసిన ఈ టెండర్ విధానాన్ని వీకే సారస్వత్ వ్యతిరేకిస్తున్నారు.
టెలికం శాఖ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టులో టెలికం ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (టెమా) సవాల్ చేసింది. ఈ ప్రాజెక్టు టెండరింగ్ సందేహాలకు తావిస్తున్నదని పేర్కొంటూ గత ఏప్రిల్లో టెలికం శాఖకు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ బహిరంగ లేఖ కూడా రాశారు.
దేశీయంగా సురక్షితమైన ఆర్థికంగా శక్తిమంతమైన, విశ్వసనీయమైన ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ నిర్మించాలని నిర్ణయించుకున్నప్పుడు భారతీయ కంపెనీలను ప్రోత్సహించాలని సారస్వత్ తన లేఖలో తెలిపారు. టెండర్ నిబంధనలు మారిస్తే బీఎస్ఎన్ఎల్ టెండర్ దాఖలు చేసే అవకాశం ఉంటుందన్నారు. కానీ టెండర్ షరతులు మాత్రం ఉద్దేశపూర్వకంగా దేశీయ కంపెనీలను దూరం పెట్టేలా ఉన్నాయని స్పష్టం చేశారు.
గతేడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ఈ స్కీమ్ ప్రకటించారు. కోచి నుంచి సముద్ర మార్గం మీదుగా లక్ష్యద్వీప్లోని 11 దీవులను కలిపేందుకు దీన్ని ప్రతిపాదించారు. ఈ-కామర్స్, సుపరిపాలనను ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఈ ఫైబర్ ఆఫ్టిక్ కేబుల్ నెట్వర్క్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే లక్షద్వీప్ వాసులకు 100జీబీపీఎస్ స్పీడ్ బ్యాండ్విడ్త్తో మొబైల్ సేవలు అందుబాటులోకి వస్తాయి.