Cars Sales | ఫెస్టివ్ సీజన్ ప్రారంభం కావడంతో కార్ల విక్రయాలు శరవేగంగా సాగుతున్నాయి. గత నెలలో గతంలో ఎన్నడూ లేని విధంగా సేల్స్ నమోదయ్యాయి. పండుగల సీజన్ నేపథ్యంలో కార్ల తయారీ సంస్థలు సైతం ఉత్పత్తితోపాటు కార్ల పంపిణీ పెంచేశాయి. సెమీ కండక్టర్ల లభ్యతతోపాటు ఎస్యూవీ కార్లకు గిరాకీ లభించింది. ఫలితంగా గత నెలలో 3,63,733 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు ఆగస్టు నెలలో 3,60,897 కార్లు అమ్ముడైన సంగతి తెలిసిందే. జనవరి తర్వాత ఏనెలకానెల కార్ల సేల్స్ లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 10,76,983 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది రెండో త్రైమాసికంలో 10.26 లక్షల కార్లను ఆయా కార్ల తయారీ సంస్థలు విక్రయించారు. దేశీయ కార్ల మార్కెట్లో తొలి అర్థభాగంలో 20 లక్షల మార్క్ను దాటేసి 20,72,957 యూనిట్లు అమ్ముడయ్యాయి.
జనవరి -సెప్టెంబర్ మధ్య 30 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. 2022-23, ’023-24 ఆర్థిక సంవత్సరాల్లో కార్ల విక్రయాలు 40 లక్షలు దాటతాయని మారుతి సుజుకి సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. ఆగస్టు 17 నుంచి నవంబర్ 14 వరకూ 87 రోజుల పాటు సాగే పండుగల సీజన్లో ఐదు లక్షల ఎస్ యూవీ కార్లతోపాటు మొత్తం 10 లక్షల కార్లు అమ్ముడవుతాయని అంచనా వేశారు.
మారుతి సుజుకి దేశీయంగా 1,50,812, హ్యుండాయ్ 54,241, టాటా మోటార్స్ 44809, మహీంద్రా అండ్ మహీంద్రా 41,267 కార్లు విక్రయించాయి. మహీంద్రా కార్ల విక్రయాల్లో ఇదే గరిష్టం. ఇప్పటి వరకూ దాదాపు సగం కార్లు ఎస్యూవీ కార్లు అమ్ముడైతే.. సెప్టెంబర్లో ఎస్ యూవీ కార్ల వాటా 52 శాతానికి చేరుకున్నది.