ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, జూలై డెరివేటివ్ సిరీస్ ముగింపు, కార్పొరేట్ ఫలితాల ప్రభావంతో గతవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ తుదకు 99 పాయింట్ల నష్టంతో 19,646 పాయింట్ల వద్ద ముగిసింది. డెయిలీ చార్టుల్లో చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం డోజి క్యాండిల్ ఏర్పడిందని, ఇది మార్కెట్లో అయోమయ స్థితిని సూచిస్తున్నదని విశ్లేషకులు తెలిపారు. దీంతో ప్రతీ అప్సైడ్లోనూ అమ్మకాల ఒత్తిడి నెలకొంటుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నాగరాజ షెట్టి అంచనా వేశారు. ఇదే అభిప్రాయాన్ని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోది వ్యక్తం చేస్తూ ట్రెండ్ మాత్రం బుల్లిష్గానే ఉన్నదని చెప్పారు.
ఈ వారం నిఫ్టీకి 20 డీఈఎంఏ రేఖ కదులుతున్న 19,500 స్థాయి వద్ద కీలక మద్దతు లభిస్తున్నదని, 19,800 స్థాయిని అధిగమిస్తే తిరిగి అప్ట్రెండ్ మొదలవుతుందని జిమిత్ మోదీ తెలిపారు. మూమెంటం ఇండికేటర్ సంకేతాల ప్రకారం ఇక నుంచి ప్రతీ అప్సైడ్ బౌన్స్లో అమ్మకాలు జరుగుతాయని, పుల్బ్యాక్ ర్యాలీలు నిలదొక్కుకోవడం కష్టమని నాగరాజ శెట్టి వివరించారు. 19,750-19,800 శ్రేణి గట్టి అవరోధాన్ని కల్పించవచ్చని, 19,500-19,450 మధ్య ఉన్న మద్దతు ముఖ్యమైదని చెప్పారు.19,500 మద్దతును కోల్పోతే లాభాల స్వీకరణతో పాటు, షార్ట్ పొజిషన్లు క్రియేట్ అవుతాయని, 19,300-19,200 శ్రేణి వరకూ క్షీణించవచ్చని ఇన్వెస్ట్4 ఎడ్యు అనలిస్ట్ ఆదిత్యా అగర్వాల్ విశ్లేషించారు.