IT E-portal | గత ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయాల్సిన టైం వచ్చేసింది. కానీ, పన్ను చెల్లింపుదారులు మెరుగ్గా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలన్న సంకల్పంతో ఆదాయం పన్ను (ఐటీ) విభాగం కొత్త ఈ-పోర్టల్ ప్రారంభించి ఏడాది దాటింది. కానీ దాని బాలారిస్టాలు మాత్రం ఇంకా దాటనే లేదు. తాజాగా ఈ-ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నదని పలువురు యూజర్లు ఫిర్యాదు చేశారు. దీనిఐ ఆదాయం పన్ను విభాగం శనివారం సాయంత్రం రియాక్టయింది. ఈ ఈ-పోర్టల్ నిర్వాహక సంస్థ.. సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నదని తెలిపింది. ట్రాఫిక్ రెగ్యులర్గా ఉండటం (irregular traffic) వల్లే సాంకేతిక సమస్యలు తలెత్తాయని ఐటీ విభాగం వెల్లడించింది.
`ఆదాయం పన్ను విభాగం (ఐటీడీ) ఈ-ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు పలువురు పన్ను చెల్లింపుదారులు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారాన్ని ఇన్ఫోసిస్ దృష్టికి తెచ్చాం. పోర్టల్పై ఇరెగ్యులర్ ట్రాఫిక్ వల్లే ఈ సమస్య తలెత్తిందని వారు చెప్పారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని ఇన్ఫోసిస్ తెలిపింది` అని ఐటీ విభాగం ట్వీట్ చేసింది.
ఐటీ ఈ-పోర్టల్లో నెల రోజుల్లోపు సాంకేతిక సమస్యలు తలెత్తడం ఇది రెండోసారి. గత నెల ప్రారంభంలో ఐటీ ఈ-పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ అంశాన్ని ఇన్ఫోసిస్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఐటీ శాఖ తెలిపింది. న్యూ ఐటీ ఈ-పోర్టల్ తయారీ కాంట్రాక్టును 2019లో ఇన్ఫోసిస్ గెలుచుకున్నది. గతేడాది జూన్లో వినియోగంలోకి తీసుకొచ్చింది.