న్యూఢిల్లీ, ఆగస్టు 20: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ( Facebook ).. భారత్లో తమ చిన్న వ్యాపార ప్రకటనదారుల కోసం రుణాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 200 నగరాల్లో ఈ రుణ సౌకర్యాన్ని శుక్రవారం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఫేస్బుక్పై ప్రకటనలిచ్చే చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థ (ఎస్ఎంఈ)లు రూ.5 లక్షల నుంచి 50 లక్షల వరకు లోన్లు పొందవచ్చు. గతేడాది సెప్టెంబర్లో భారత్సహా 30 దేశాల్లో స్మాల్ బిజినెస్ లోన్లు ఇస్తామని ఫేస్బుక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు భారత్ నుంచి మొదలుపెట్టింది. వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ నిర్వహించిన ఓ వర్చువల్ కార్యక్రమంలో భాగంగా ఈ లోన్ల సదుపాయాన్ని ఫేస్బుక్ ప్రకటించింది.
ఇండిఫీ భాగస్వామ్యంతో..
లెండింగ్ వేదిక ఇండిఫీ ద్వారా ఎస్ఎంఈలకు ఫేస్బుక్ ఈ రుణాలను మంజూరు చేయనున్నది. ఈ మేరకు ఇండిఫీతో ఫేస్బుక్ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నది. వ్యాపార రుణాలు చిరు వ్యాపారులకు అత్యంత సులువుగా లభించేలా చేయడమే తమ ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఫేస్బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు, ఎండీ అజిత్ మోహన్ మీడియాకు స్పష్టం చేశారు. కరోనా పరిస్థితుల ప్రభావం నేపథ్యంలో ఎస్ఎంఈలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, రుణ లభ్యత కష్టతరమైపోయిందన్నారు. కాగా, ఈ రుణాల కోసం ఎలాంటి పూచీకత్తు అవసరం లేదన్న ఆయన 17-20 శాతం వార్షిక వడ్డీరేటుతో రుణాలు తీసుకోవచ్చన్నారు. మహిళల నేతృత్వంలో నడిచే సంస్థలకు వడ్డీరేటుపై 0.2 శాతం రాయితీ ఉంటుందన్నారు. ఇండిఫీ ద్వారా ప్రాసెసింగ్ ఫీ ఉండబోదన్నారు. రుణాల పంపిణీ, వసూళ్లు అంతా ఇండిఫీ బాధ్యతేనన్నారు. దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లో రుణ మంజూరు జరిగిపోతుందన్నారు. ఎంతమంది వ్యాపారులకైనా రుణాలు మంజూరవుతాయన్న మోహన్.. తమతో మరిన్ని సంస్థలు చేతులు కలిపితే మార్కెట్లో రుణ లభ్యత పెరుగుతుందన్నారు.
రూ.30 కోట్ల గ్రాంట్
హైదరాబాద్సహా దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లోని ఎస్ఎంఈలకు గత సంవత్సర కాలంలో ఆర్థిక చేయూత కింద గ్రాంట్లను మంజూరు చేసినట్లు ఫేస్బుక్ తెలియజేసింది. కరోనాతో ప్రభావితమైన సంస్థలకు ఈ సాయం అందించినట్లు పేర్కొన్నది. హైదరాబాద్, న్యూఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరుల్లోని 3,000 ఎస్ఎంబీలకు రూ.30 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించింది. అంతర్జాతీయంగా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి తమ యాప్లను ప్రతి నెలా దాదాపు 20 కోట్ల వ్యాపారులు వినియోగిస్తున్నట్లు ఫేస్బుక్ చెప్తున్నది.