డిసెంబర్లో 37.29 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ, జనవరి 3: తాజాగా ముగిసిన డిసెంబర్ నెలలో దేశం నుంచి ఎగుమతులు భారీగా పెరిగి రికార్డుస్థాయిలో 37.29 బిలియన్ డాలర్లకు చేరాయి. ఒక నెలలో ఈ స్థాయిలో ఎగుమతులు జరగడం ఇదే ప్రధమం. 2020 డిసెంబర్ నెలతో పోలిస్తే ఇవి 37 శాతం అధికమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 2021 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 300 బిలియన్ డాలర్ల మార్క్ను చేరినట్టు సోమవారం వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరం ఎగుమతుల స్థాయిని అధిగమించామన్నారు. ఈ 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తంమీద ఎగుమతులు 400 బిలియన్ డాలర్లను మించుతాయని అంచనా వేస్తున్నామని చెప్పారు. అలాగే గతంలో ఏ క్వార్టర్ లోనూ రానంతగా, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఎగుమతుల ద్వారా 103 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం సమకూరిందని గోయల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నెలలోనూ ఎగుమతుల్లో వృద్ధి నమోదయ్యిందన్నారు. డిసెంబర్ నెలలో రంగాల వారీగా చూస్తే ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 37 శాతం పెరగ్గా, జెమ్స్, జ్యువెల్లరీ 16 శాతం, రెడీమేడ్ దుస్తులు 22 శాతం, ఎలక్ట్రానిక్స్ 33 శాతం చొప్పున అధికమయ్యాయి.
పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు..
ప్రస్తుతం పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై భారత్ చర్చలు జరుపుతున్నదని పీయుష్ గోయల్ వెల్లడించారు. ఆస్ట్రేలియాతో ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు ముగింపుదశలో ఉన్నాయని, యూకేతో వాణిజ్య చర్చలు ఈ నెలలో మొదలై, మార్చికల్లా ముగుస్తాయని వివరించారు. యూఏఈతో సమగ్ర వ్యాపార భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు కూడా ముగింపునకు వచ్చా యన్నారు. కెనడా, ఇజ్రాయిల్తో త్వరలో వాణిజ్య చర్చల్ని ప్రారంభి స్తామన్నారు.