న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: గత కొన్ని నెలలుగా భారీగా పుంజుకున్న దేశీయ ఎగుమతులు మళ్లీ నీరసించాయి. విదేశాల్లో దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పడిపోవడంతో గత నెలకుగాను ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. ఆగస్టులో 33 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 1.15 శాతం తగ్గినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఇదే నెలలో భారత్ 61.68 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నది. దీంతో వాణిజ్యలోటు(ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) రెండింతలు పెరిగి 28.68 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఆగస్టు 2021లో లోటు 11.71 బిలియన్ డాలర్లుగా ఉన్నది. గత నెలలో చమురు దిగుమతులు 86 శాతం ఎగబాకి 17.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
కానీ, పసిడి దిగుమతులు 47.54 శాతం తగ్గి 3.51 బిలియన్ డాలర్లకు పరిమితమవడం విశేషం. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టు మధ్యకాలానికిగాను ఎగుమతులు 17.12 శాతం పెరిగి 192.59 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 45.64 శాతం ఎగబాకి 317.81 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్యలోటు 125.22 బిలియన్ డాలర్లుగా ఉన్నది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో లోటు 53.78 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఎగుమతులు 450 బిలియన్ డాలర్లు అంచనావేస్తున్నట్లు వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణియమ్ తెలిపారు.