హైదరాబాద్, జూలై 1: రూ.1000 ఫీజు కట్టి, ఆధార్ నంబర్తో పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్)ను లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన గడువు జూన్ 30తో ముగిసింది. ఈ గడువును గతంలో పలుమార్లు పొడిగించినప్పటికీ, ఈ దఫా ఇప్పటివరకూ అటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడలేదు. దీంతో ఆధార్తో లింక్కాని పాన్ జూలై 1 నుంచి నిరుపయోగం అవుతుంది. పాన్ ఇన్ఆపరేటివ్ అయితే ఆ నంబర్ను ఉపయోగించి చేయాల్సిన పనులేవీ చేయలేరు. ఇలా పనిచేయని పాన్ను తిరిగి యాక్టివేట్ చేసే ప్రక్రియను ఈ ఏడాది మార్చి 28 నాటి నోటిఫికేషన్లో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వివరించింది. ‘రూ.1,000 ఫీజు చెల్లించిన తర్వాత ఆధార్ నంబర్ను సంబంధిత యంత్రాంగానికి (ఐటీ శాఖ) తెలియపరిస్తే 30 రోజుల్లో పాన్ మళ్లీ ఆపరేటివ్ అవుతుంది’ అని తెలిపింది.
గడువు ముగిసే లోపు ఇదే ప్రక్రియను పూర్తిచేసి ఉంటే పాన్ నిరుపయోగం కాదని, కానీ ఇప్పుడు చేస్తే తిరిగి యాక్టివేట్ కావడానికి 30 రోజులు పడుతుందని ట్యాక్స్ నిపుణులు వివరించారు. కానీ పాన్ పనిచేయని రోజుల్లో ఇన్కం ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేరు. అలాగే ఐటీ రిఫండ్స్ కూడా రావు. పాన్ నంబర్ను కోట్ చేయడం తప్పనిసరి అయిన బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు, డీమ్యాట్ ఖాతాను తెరవడం వంటివి చేయలేరు. అలాగే పాన్ నిర్వీర్యం అయిన సందర్భంలో అధిక శాతం టీడీఎస్ మినహాయింపు, టీసీఎస్ వసూలు జరుగుతుంది. సంబంధిత ఐటీ అసెసింగ్ అధికారి సెక్షన్ 272బీ కింద రూ.10,000 పెనాల్టీ కూడా విధించే అవకాశం ఉంది.