న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న వేళ 2023-24 కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో ఒకటని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్న క్రమంలో రానున్న బడ్జెట్లో ఈ రంగానికి నిధుల కేటాయింపు అధికంగా ఉండాలని ఆరోగ్య రంగ నిపుణులు, ప్రతినిధులు కోరుతున్నారు.
2022-23 బడ్జెట్లో అంతకుముందు ఏడాది కంటే 16.5 శాతం అధికంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 86,200 కోట్లు కేటాయించారు. బడ్జెట్ 2023లో ఈ రంగానికి 20 నుంచి 30 శాతం అధికంగా నిధులు కేటాయించాలని పరిశ్రమ ప్రతినిధులు కోరుతున్నారు. ఇన్సూరెన్స్, వ్యాక్సిన్లు, టెక్నాలజీ, ఆర్అండ్డీ విభాగాలపై వెచ్చించేందుకు ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు భారీగా పెంచాలని వారు పట్టుబడుతున్నారు.
పేదరిక నివారణ, ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ పెట్టుబడులతో యూనివర్సల్ హెల్త్ కేర్ వ్యవస్ధను ఏర్పాటు చేయాలని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ శరద్ కుమార్ కోరారు. హెల్త్కేర్ ప్రొవైడర్ చెల్లించే జీఎస్టీని తగ్గించాలని అభ్యర్ధించారు. డయాగ్నస్టిక్స్ పరిశ్రమ కోసం సముచిత రీతిలో నిధుల కేటాయింపు ఉండాలని సిటీ ఎక్స్రే, స్కాన్ క్లినిక్ చీఫ్ రేడియాలజిస్ట్, వైద్య సలహాదారు డాక్టర్ ఆకార్ కపూర్ కోరారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో డిజిటలీకరణకు అదనంగా నిధులు సమకూర్చాలని అపోలో టెలిహెల్త్ సీఈఓ విక్రం తప్లూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.