‘లాక్డౌన్లోనూ మా వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించాం. క్లయింట్లకు మెరుగైన సేవలు అందించడం వల్లనే ఇది సాధ్యమైంది. డిమాండ్కు అనుగుణంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడు మరో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం. గత రెండేండ్లలో ఉద్యోగుల సంఖ్యను రెండు రెట్లు పెంచాం. మరో ఏడాది కాలంలో నైపుణ్యం కలిగిన మరో వెయ్యి మంది భారతీయులకు ఉపాధి కల్పించాలనుకుంటున్నాం’
– దిశాంత్ భోజ్వానీ, సైక్స్ ఇండియా హెడ్
హైదరాబాద్, మార్చి 8: విదేశీ సంస్థలకు హైదరాబాద్ నెలవుగా మారుతున్నది. ఇప్పటికే అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేయగా.. మరికొన్ని సంస్థలు ఇక్కడ వ్యాపారాలను మరింత విస్తరిస్తున్నాయి. ఈ జాబితాలో అమెరికు చెందిన గ్లోబల్ డిజిటల్ మార్కెటింగ్, కస్టమర్ సేవల సంస్థ సైక్స్ కూడా చేరింది. తాజాగా హైదరాబాద్లో నాలుగో కార్యాలయాన్ని ప్రారంభించింది. కోకాపేట్లోని లక్ష్మీ ఇన్ఫోబాన్ వద్ద 44 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆఫీస్ను నెలకొల్పింది. భారత్లో సైక్స్కు ఇది ఆరో కార్యాలయం. ఈ ఏడాది చివరి నాటికి మరో 700 నుంచి 800 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 500 మంది సిబ్బంది కూర్చోవడానికి వీలుండే ఈ ఆఫీస్ను దశలవారీగా విస్తరించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2 వేలకు చేరనున్నది.
కరోనా వైరస్ విజృంభణ సమయంలోనూ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించిన సైక్స్.. భారత్లో గత ఏడాదికాలంలోనే రెండు ఆఫీస్లను ప్రారంభించడం విశేషం. 2019లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ సంస్థకు అమెరికాతోపాటు పలు ఇతర దేశాల్లో 2 వేల కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి.